-

'విశాఖను ఆర్థిక రాజధాని చేస్తాం'

24 Jun, 2014 14:13 IST|Sakshi
'విశాఖను ఆర్థిక రాజధాని చేస్తాం'

విశాఖపట్నం నగరాన్ని ఆర్థిక రాజధానిగా చేస్తామని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. మంగళవారం గంటా శ్రీనివాసరావు హైదరాబాద్లో మాట్లాడుతూ... విశాఖపట్నంలో కొత్తగా ఇంటర్నేషన్ ఎయిర్పోర్ట్కు ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నామని తెలిపారు. అందుకోసం స్థలసేకరణ చేపట్టాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్కు ఆదేశాలు జారీ చేశామని అన్నారు. విశాఖపట్నంలో మెట్రో రైలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అందుకు టెండర్లు కూడా పిలిచామని చెప్పారు.

అలాగే విశాఖపట్నంలో సినీ పరిశ్రమ అభివృద్ధి చేయాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని.... సినీ నిర్మాతలతో సంప్రదిస్తున్నామని చెప్పారు. అలాగే జిల్లాలోని అరకు, భీమిలీ ప్రాంతాలలో షూటింగ్ స్పాట్లు ఏర్పాటు చేస్తున్నట్లు గంటా శ్రీనివాసరావు వివరించారు. గంగవరం పోర్టును నిర్మిస్తామని...దుగ్గరాజుపట్నంలో పోర్టు ప్రతిపాదనపై పునరాలోచిస్తామని గంటా శ్రీనివాసరావు వెల్లడించారు.

మరిన్ని వార్తలు