విదేశీ ముఠాల హస్తాన్ని తోసిపుచ్చలేం​ : పోలీస్‌ కమిషనర్‌

1 Dec, 2019 12:00 IST|Sakshi

సాక్షి, విశాఖపట్టణం : సిటీలో దొంగ నోట్ల ముద్రణ, చెలామణీ రాకెట్‌ను పోలీసులు ఆదివారం ఛేదించారు. ఎంవీపీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో రెండు వేల నోట్లు, వంద రూపాయల నోట్లు చెలామణీ చేస్తుండగా ఓ రియల్‌ఎస్టేట్‌ వ్యాపారిని పట్టుకొని అతని వద్దనుంచి సుమారు 3 లక్షల రూపాయల దొంగనోట్లు స్వాధీనం చేసుకున్నారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. నోట్లను పరిశీలించిన పోలీసులు వాటిని పకడ్బందీగా ముద్రించినట్టు నిర్థారించారు. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకునేందుకు ఎన్‌.ఐ.ఏ సహాయం తీసుకోవాలనే ఆలోచనలో పోలీసులు ఉన్నారు. విదేశీ ముఠా హస్తం ఉండే అవకాశముందంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై సిటీ పోలీస్‌ కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ మీనా స్పందిస్తూ.. పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌ నుంచి ఫేక్‌ కరెన్సీ అక్రమ రవాణాను తోసిపుచ్చలేమని వ్యాఖ్యానించారు. నోట్ల పంపిణీ ముఠాను అరెస్ట్‌ చేస్తే పూర్తి ఆధారాలు లభిస్తాయని వెల్లడించారు.  

మరిన్ని వార్తలు