విశాఖనే పరిపాలన రాజధాని

16 Jun, 2020 11:46 IST|Sakshi

సాక్షి, అమరావతి : పరిపాలన వికేంద్రీకరణ అత్యంత కీలకమైన అంశంగా ప్రభుత్వం భావిస్తోందని గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌ పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన మూడు రాజధానులు ఏర్పాటు శాసన ప్రక్రియలో ఉందని స్పష్టం చేశారు. శాసన రాజధానిగా అమరావతి, కార్యానిర్వాహక రాజధానిగా విశాఖపట్నం, న్యాయ రాజధానిగా కర్నూలు ఉంటుందని మరోసారి గుర్తుచేశారు. శాసనసభ, మండలి బడ్జెట్‌ సమావేశాలను పురస్కరించుకుని ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో గవర్నర్‌ ఈ అంశాన్నిపునరుద్ఘాటించారు. (ఏపీ బడ్జెట్‌: 3.98 కోట్ల మందికి లబ్ధి)

గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పరిపాలన వికేంద్రీకరణకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రణాళిలు రచించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగానే ఇప్పటికే అభివృద్ధిలో దూసుకుపోతున్న విశాఖను పరిపాలన రాజధానిగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే వెనుకబడిన రాయలసీమకు పూర్వవైభవం తీసుకువచ్చేలా, కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేసి న్యాయ రాజధానిగా గుర్తించాలని సంకల్పించింది. ప్రభుత్వ నిర్ణయానికి ప్రతిపక్ష టీడీపీ నిత్యం అభ్యంతరం వ్యక్తం చూస్తూ కోర్టులో కేసులు వేస్తున్నా, ప్రజా శ్రేయస్సు దృష్ట్యా మూడు రాజధానులకే ముఖ్యమంత్రి జగన్‌ కట్టుబడి ఉన్నారు. ఈ మేరకు సంబంధిత బిల్లుకు రాష్ట్ర శాసనసభ సైతం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు