బంగ్లా కోస్ట్‌గార్డ్‌ అదుపులో ఆంధ్ర జాలర్లు

4 Oct, 2019 16:40 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు జాలర్లను బంగ్లాదేశ్‌ కోస్ట్‌గార్డ్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గత నెల 24న విశాఖ నుంచి 8 మంది మత్య్సకారులు చేపల వేటకు వెళ్లారు. పారదీప్‌ దాటిన తరువాత మత్య్సకారులు ప్రయాణిస్తున్న బోటు ఇంజిన్‌లో లోపం తలెత్తింది. దీంతో వారు పారాచూట్‌ సాయంతో బోట్‌ను నిలిపివేసినా.. వాతావరణం సహకరించలేదు. కరెంట్‌ తీవ్రతతో వారు ప్రయాణిస్తున్న బోటు భారత్‌ సరిహద్దులు దాటి బంగ్లాదేశ్‌ సముద్ర జల్లాలోకి ప్రవేశించింది. దీంతో తీర ప్రాంతంలో గస్తీ నిర్వహిస్తున్న బంగ్లా కోస్ట్‌గార్డ్‌ సిబ్బంది భారత మత్య్సకారులను అదుపులోకి తీసుకున్నారు.

కాగా, బంగ్లా కోస్ట్‌గార్డ్‌ అదుపులో ఉన్న మత్య్సకారుల స్వస్థలం.. విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం తిప్పలవలస. వారు జీవనోపాధి కోసం.. విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌ కేంద్రంగా చేపల వేటకు వెళ్తుంటారు. మత్య్సకారులను బంగ్లా అధికారులు అదుపులోకి తీసుకోవడంతో.. వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. వారిని విడిపించేందుకు మత్య్సకార సంఘాల నేత జానకిరామ్‌ సాయంతో బోటు యజమాని వాసుపల్లి రాము.. విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణను ఆశ్రయించారు.

మరిన్ని వార్తలు