విజయనగరం ,ప్రజాసంకల్పయాత్ర బృందం: జీఓ 23తో తెలుగుదేశ ప్రభుత్వం విశ్వబ్రాహ్మణులకు తీవ్ర అన్యాయం చేసిందని విశ్వబ్రాహ్మణ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కిల్లంపల్లి ఆచారి ఆరోపించారు. జిల్లా కేంద్రంలో సోమవారం జరిగిన ప్రజాసంకల్పయాత్రలో వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డిని కలిసి సమస్యలు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో సుమారు 30 లక్షల మంది విశ్వబ్రాహ్మణ కులస్తులు (వడ్రంగి, స్వర్ణకార, కంచర, శిల్పి, కమ్మర) ఉన్నామన్నారు.
మా సంక్షేమం కోసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేశారని తెలిపారు. అలాగే వంద కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారన్నారు. అనంతర కాలంలో ఆయన అకాల మరణం చెందడంతో టీడీపీ ప్రభుత్వం ఫైనాన్స్ కార్పొరేషన్ స్థాయిని ఫెడరేషన్గా మారుస్తూ జీఓ 23 తీసుకువచ్చి మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే నాన్నగారి ఇచ్చిన హామీ ప్రకారం విశ్వబ్రాహ్మణులకు న్యాయం చేయాలని కోరారు. అలాగే 50 సంవత్సరాలు దాటిన వారికి రెండు వేల రూపాయల పింఛన్ ఇప్పించాలన్నారు.