ఓటు నమోదైతే ఒట్టు!

14 Mar, 2019 13:27 IST|Sakshi

ఓటరు నమోదుకు కష్టాలు

తెరుచుకోని ఎన్‌వీఎస్‌పీ వెబ్‌సైట్‌

మరో రెండు రోజులే నమోదుకు గడువు

 ప్రత్యామ్నాయం చూపించాలని పలువురు వినతి  

సాక్షి, శ్రీకాకుళం పాతబస్టాండ్‌: ఓటరు నమోదుకు ఇంకా రెండు రోజులే గడువు ఉన్న నేపథ్యంలో ఓటు నమోదు కోసం జనం ఎగబడుతున్నారు. అయితే దీనికి సంబంధించిన వెబ్‌సైట్‌ మాత్రం వారి ఉత్సాహంపై నీళ్లు చల్లుతోంది. రానున్న సార్వత్రిక ఎన్నికలకు ఓటు హక్కు పొందాల ని జిల్లాలోని పలువురు ఆన్‌లైన్‌ ద్వారా ప్రయత్నం చేస్తుండగా అది సాధ్యం కావడం లేదు. ఓటరుగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవడానికి ఎన్నికల సంఘం సీఈఓ ఈ–రిజిస్ట్రేషన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఎన్‌వీఎస్‌పీ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఫారం–6ను నింపి అప్‌లోడ్‌ చేయ డం ద్వారా ఓటరు నమోదు చేసుకోవచ్చని ఎన్నిక ల సంఘం కూడా సూచించింది. జిల్లాలోని పలు వురు ఉద్యోగులు, యువకులతోపాటు జిల్లాకు చెంది ఇతర ప్రాంతాల్లో నివాసముంటున్న పలు వురు ఓటరుగా నమోదు చేసుకునేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. ఫారం–6 నింపుతుండగా కొన్నిసార్లు, ఫొటో అప్‌లోడ్‌ చేస్తుండగా కొన్ని సార్లు సమస్య తలెత్తుతోంది. దరఖాస్తు అసలు అప్‌లోడ్‌ కావడం లేదు.

సమస్యను 1950కు నేరుగా గానీ, ఎస్‌ఎంఎస్‌ ద్వారా గాని తెలియజేద్దామంటే అది కూడా సాధ్యం కావడం లేదు. కొంద రు ఓటర్లు తమ ఓటు వివరాలను తెలుసుకునేం దుకు 1950కు వివరాలు పంపించినా తిరిగి వచ్చి న జవాబు అర్థంకాని భాషలో ఉండడంతో ఇబ్బందులు పడుతున్నారు. 

హెల్ప్‌లైన్‌ యాప్‌లో కూడా ఇలాంటి సమస్య లే ఎదురవుతున్నట్లు బాధితులు చెబుతున్నారు. ఓటరు నమోదునకు మరో రెండు రోజులే గడువు ఉండగా ఆన్‌లైన్‌లో ఇబ్బందులు ఎదురవుతుండడంతో ప్రత్యామ్నాయం చూపించాలని పలువురు కోరుతున్నారు. 

సంతకవిటి మండలం మందరాడ గ్రామానికి చెందిన లెంక భాగ్యశ్రీ ఓటు నమోదు చేసుకుందామని రెండురోజులుగా ప్రయత్నిస్తున్నారు. కానీ వెబ్‌సైట్‌ పనిచేయకపోవడంతో సాధ్యం కావడం లేదు. ఈమె శృంగవరపుకోటలో ఉండేవారు. వివా హం జరగడంతో సంతకవిటి మండలం మందరాడకు వచ్చారు. ఇటీవల ఎస్‌. కోటలో ఓటును రద్దు చేయించుకుని, మందరాడలో నమోదు చేసుకోవాలని రెండు రోజులుగా ప్రయత్నిస్తున్నా ఎన్‌వీఎస్‌పీ వెబ్‌సైట్‌ తెరుచుకోకపోవడంతో అది సాధ్యం కాలేదు. 

శ్రీకాకుళం నగరానికి చెందిన పాలిశెట్టి లీలవతి ఓటర్ల జాబితాలో తనపేరు ఉందో లేదో తెలుసుకునేం దుకు 1950కు ఎస్‌ఎంఎస్‌ పంపించింది. అక్కడి నుంచి తిరుగు సమాధానంగా మీ నంబర్‌ రిజిస్టర్‌ అయిందని, త్వరలోనే వివరాలు తెలుపుతామని సమాచారం వచ్చింది. తర్వాత వచ్చిన ఎస్‌ఎంఎస్‌ను చూడగా అందులో ప్లస్‌లు, మైనస్‌లు, వేర్వేరు గుర్తులు ఉండడంతో ఏం చేయాలో తెలీక మిన్నకుండిపోయింది. 

అష్టకష్టాలు..
మా గ్రామం యారబాడులో గతంలో నాకు ఓటు ఉండేది. ఇటీవల కొత్తగా వచ్చిన జాబితాలో పరిశీలిస్తే పేరు లేదు. ఎవరు తొలగించారో తెలీడం లేదు. మళ్లీ ఓటు కోసం దరఖాస్తు చేయడానికి మీ సేవ చుట్టూ రెండు రోజులుగా తిరుగుతున్నా. పని కావడం లేదు. దరఖాస్తు చేసేందుకు ఆన్‌లైన్‌ సర్వర్‌ బాగులేదు. సర్వర్‌ డౌన్‌లో ఉంది అని మీ సేవా వాళ్లు అంటున్నారు. సమయం చూస్తే రెండు రోజులే ఉంది. ఇప్పుడు సర్వర్‌ డౌన్‌ అంటే ఎలా?  
– ఎస్‌.రామినాయుడు, యారబాడు, నరసన్నపేట 


ఆన్‌లైన్‌లో పెట్టాం గానీ ఓటు రాలేదు
పలాస మండలం చినంచల గ్రామానికి చెందిన నేను ఇటీవల ఓటు తనిఖీ చేయించాను. మా గ్రామానికి చెందిన ఓటరు లిస్టులో నా పేరులేదు. రెండు రోజుల కిందటే మళ్లీ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నాను. కానీ ఇంతవరకు ఎలాంటి జవాబు రాలేదు. ఇంకా రెండురోజులు గడువు ఉంది. ఆన్‌లైన్‌ సమస్యగా చెబుతున్నారు తప్ప ఓటు హక్కు ఇవ్వడం లేదు.
– బమ్మిడి కామయ్య, చినంచల గ్రామం, పలాస మండలం

మరిన్ని వార్తలు