పవన్‌ ఇదేం పని?

12 Apr, 2019 05:01 IST|Sakshi
ఓటర్లను నెట్టివేస్తూ వెళ్తున్న పవన్‌ వ్యక్తిగత సిబ్బంది

నేరుగా పోలింగ్‌బూత్‌లోకి చొచ్చుకెళ్లిన వైనం.. ఓటర్ల ఆగ్రహం

మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ప్రతి విషయంలోనూ సమాజానికి ఆదర్శంగా ఉంటానని సుద్దులు చెప్పే పవన్‌కల్యాణ్‌ వ్యవహరించిన తీరుకు ఓటర్లు తీవ్ర అసహనానికి గురయ్యారు. గురువారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తన ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చిన జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌కు ఓటర్ల నుంచి స్పందన కరువైంది. మొదట ఆయన సాధారణ ప్రజల మాదిరిగా లైనులో నిలబడి ఓటు హక్కు వినియోగించుకుంటారని అక్కడకు చేరుకున్న జనసేన నాయకులు చెప్పారు.

అయితే ఆయన కేంద్రానికి వచ్చినపుడు ప్రజల నుంచి స్పందన లేకపోవడంతో.. అసహనానికి గురై నేరుగా పోలింగ్‌ బూత్‌లోకి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకుని నిమిషాల వ్యవధిలోనే మీడియాతో మాట్లాడి అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఎప్పటి నుంచో ఓటు వేయడానికి లైన్‌లో వేచి ఉన్న ఓటర్లు పవన్‌ వస్తే మమ్మల్ని ఇబ్బంది పెడతారా? అతనికో రూలు మాకో రూలా అంటూ ఎన్నికల సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, పవన్‌ వచ్చినప్పుడు ఎలక్ట్రానిక్‌ మీడియా కెమెరామెన్‌లు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు.

మరిన్ని వార్తలు