ఓటింగ్పై స్పీకర్ మీనమేషాలు

30 Jan, 2014 12:05 IST|Sakshi
ఓటింగ్పై స్పీకర్ మీనమేషాలు

మీనమేషాలు లెక్కించకుండా శాసన సభలో విభజన బిల్లుపై ఓటింగ్ నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దేవినేని ఉమ గురువారం స్పీకర్ నాదెండ్ల మనోహర్కు విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ... విభజన బిల్లుపై మెజార్టీ నిర్ణయం తెలియాలంటే శాసనసభలో ఓటింగ్ నిర్వహించాలని ఆయన స్పష్టం చేశారు. అందుకోసం తక్షణమే సభలో ఓటింగ్ ప్రక్రియ నిర్వహించాలని ఆయన స్పీకర్ను డిమాండ్ చేశారు. రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే ప్రగతి సాథ్యమని పేర్కొన్నారు. విభజన బిల్లుపై చర్చకు ఈ రోజు ఆఖరి రోజు కావున సమైక్యవాదాన్ని ఎట్టి పరిస్థితులలోనైన గెలిపించుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.



కేంద్రం ఏకపక్షంగా, రాజ్యాంగ విరుద్ధంగా విభజన బిల్లు రూపొందించిందని ఆరోపించారు. టి.బిల్లుపై చర్చకు మరింత సమయం కావాలని, అందుకోసం గడువు పెంచమంటే రాష్ట్రపతి మౌనం ముద్ర దాల్చారన్నారు. ప్రజాస్వామ్యం గొంతు నొక్కుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సమైక్యాంధ్రను కాపాడుకోవడానికి ఆ ప్రాంత ఎమ్మెల్యేలంతా  సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. అలాగే విభజన వాదాన్ని తరిమికొట్టాలని తొమ్మిది కోట్ల మంది రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. సీమాంధ్ర ప్రజల హక్కులు, అధికారాలను తాము పణంగా పెట్టలేమని దేవినేని ఉమ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు