వానా వానా కురవ్వా..

3 Jul, 2015 02:26 IST|Sakshi

కడప అగ్రికల్చర్ :ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెల రోజులు గడిచిపోయింది. కొన్ని ప్రాంతాల్లో అరకొర వర్షాలు కురవడంతో రైతులు వేరుశనగ, కంది, ఆముదం, సజ్జ, మొక్క జొన్న, పత్తి, ఇతర చిరుధాన్యాలు కలిపి సాగు చేశారు. నీటిపారుదల కింద వరి, చెరకు, పుసుపు, ఉల్లి, మిరప పంటలను సాగు చేశారు. చాలా మంది మెట్ట ప్రాంత రైతులు వర్షం కోసం ఎదురు చూస్తున్నారు.
 
  ఏటా ఇదే పరిస్థితి నెలకొంటుండడంతో రైతులు మదనపడుతున్నారు. ఖరీఫ్ సీజన్‌లో జూన్ నెలలో ఏటా సాధారణ వర్షం కంటే తక్కువగానే నమోదవుతోంది. ఈ ఏడాది జూన్ నెల కంతటికి కలిపి సాధారణ వర్షపాతం 69.2 మిల్లీ మీటర్లు కురవాల్సి ఉండగా 72.6 మిల్లీ మీటర్లు కురిసింది. అయితే 23 మండలాల్లో మాత్రమే సాధారణ స్థాయి కంటే మించి కురిసింది. సాధారణ వర్షపాతం 12 మండలాల్లో, 15 మండలాల్లో వర్షపాతం నమోదు కాలేదని జిల్లా రికార్డులు చెబుతున్నాయి. జిల్లాలో ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 1,60,635 హెక్టార్లుగా వ్యవసాయశాఖ అధికారులు ఖరారు చేశారు.
 
 అయితే ఇప్పటి వరకు అన్ని పంటలు కలిపి 3282 హెక్టార్లలో మాత్రమే సాగయ్యాయి. దాదాపు రెండేళ్లుగా వర్షాలు లేకపోవడంతో ఇప్పుడు కురుస్తున్న వర్షాలకు పడిన నీరంతా భూమిలోకి ఇంకిపోతోంది. ఈ కారణంగా బోరుబావుల్లో వచ్చే అరకొర నీరు కూడా ఎప్పుడు ఆగిపోతుందోనని రైతులు తీవ్రంగా మదనపడుతున్నారు. స్వల్పకాలిక పంటలను మాత్రమే సాగు చేసుకుని చాలా మంది రైతులు పూట గడుపుకుంటున్నారు. జూలై నెలలోనైనా వరా్షాలు కురవకపోతాయా అనే ఆశతో పెద్ద సంఖ్యలో రైతులు పొలాలను సాగుకు సిద్ధం చేసుకుని వేచి ఉన్నారు.
 

మరిన్ని వార్తలు