-

ఇదేం న్యాయం?

19 Mar, 2015 02:49 IST|Sakshi

సాక్షి, కడప : కడప రిమ్స్‌లో చదువుతున్న విద్యార్థులకు గౌరవ వేతనం విషయంలో ప్రభుత్వం అన్యాయం చేస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇతర జిల్లాల్లోని వైద్య కళాశాలల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు రెమ్యునరేషన్‌ను పెంచి ఇస్తుండగా, ఒక్క కడప రిమ్స్‌లో మాత్ర ం జీఓ రాలేదనే నెపంతో గౌరవ వేతనాన్ని పెంచలేదు. కడప రిమ్స్‌లో వివిధ జిల్లాలకు చెందిన వందలాది మంది విద్యార్థులు చదువుతున్నారు. 2009లో విడుదల చేసిన జీఓ ప్రకారం ప్రతి రెండేళ్లకు ఒకసారి 15 శాతం చొప్పున గౌరవ వేతనం పెంచాలనే నిబంధన ఉందని విద్యార్థులు పేర్కొంటున్నారు. హౌస్ సర్జన్లకు ప్రస్తుతం రూ.10,580 ఇవ్వాల్సి ఉండగా రూ.9 వేలు మాత్రమే ఇస్తున్నారు. పీజీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు రూ.23 వేలు ఇవ్వాల్సి ఉండగా రూ.18 వేలు, సెకండియర్ చదువుతున్న వారికి రూ.25 వేలు ఇవ్వాల్సి ఉండగా రూ.19 వేలు ఇస్తున్నారు.
 
విద్యార్థుల ఆందోళన

 తమకు అన్యాయం జరుగుతున్నా అటు ప్రభుత్వం, ఇటు అధికారులు పట్టించుకోవడం లేదని రిమ్స్ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మిగతా జిల్లాల్లో మెడిసిన్ చదువుతున్న వారికి స్టయిఫండ్ పెంచి ఇవ్వడం, రిమ్స్‌లో చదువుతున్న వారికి పెంచకుండా ఇవ్వడంలో ఉన్న మతలబు ఏమిటోనని వారు ప్రశ్నిస్తున్నారు.

రిమ్స్ డెరైక్టర్ డాక్టర్ సిద్దప్ప గౌరవ్‌ను కలిసి ఈ విషయాన్ని ఇప్పటికే పలుమార్లు విన్నవించారు. బయో మెట్రిక్ పేరుతో కూడా స్టయిఫండ్‌లో కోత పెడుతున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. మెడికోల గౌరవ వేతనంలో కోత పెట్టి.. డెరైక్టర్, ఉన్నతాధికారులకు మిగులు బడ్జెట్ చూపించారని విద్యార్థులు బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. అయితే డీఎంఈ అధికారులను ఈ విషయమై ప్రశ్నిస్తే ఎక్కడో మిగతా జిల్లాల్లో తప్పు జరిగిందని ఇక్కడ కూడా జరగాలని కోరుకుంటున్నారా? అని ప్రశ్నించారు.  
 
జీఓ వస్తే గౌరవ వేతనం పెంచుతాం : డీఎంఈ, రిమ్స్ డెరైక్టర్
మెడికోల గౌరవ వేతనం పెంచాలని ప్రభుత్వానికి మూడు, నాలుగుసార్లు ప్రతిపాదనలు పంపామని, ప్రభుత్వం జీఓ విడుదల చేస్తే వెంటనే పెంచిన వేతనాన్ని ఇస్తామని డెరైక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) వెంకటేశ్, రిమ్స్ డెరైక్టర్ డాక్టర్ సిద్దప్ప గౌరవ్ తెలియజేశారు. విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాన్ని ‘సాక్షి’ వారి దృష్టికి తీసుకెళ్లగా.. పై విధంగా స్పందించారు. బయో మెట్రిక్‌కు సంబంధించి ఒకరోజంతా హాజరు కాకుండా ఉన్న విద్యార్థులకు మాత్రమే గౌరవ వేతనంలో కొంత కోత పెట్టామని చెప్పారు.

అర గంట, గంట ఆలస్యంగా వచ్చిన వారికి స్టయిఫండ్‌లో కోత పెట్టలేదని స్పష్టం చేశారు. నిధులు మిగిలిపోయినందునే ప్రభుత్వానికి వెనక్కి పంపామని చెప్పారు. విద్యార్థుల స్టయిఫండ్‌లో కోతపెట్టి డబ్బు మిగిల్చామనడం సరికాదన్నారు. స్టయిఫండ్ పెంచినట్లు జీఓ రాగానే అమలు చేస్తామన్నారు.
 
ఎందుకీ అన్యాయం?
అన్ని జిల్లాల్లో మెడికోలకు స్టయిఫండ్ పెంచి ఇస్తున్నారు. ఒక్క రిమ్స్‌లో మాత్రం పెరిగిన మొత్తాన్ని ఇవ్వడం లేదు. బయో మెట్రిక్ పేరుతో కూడా కొంత కట్ చేస్తున్నారు. ఎన్నోసార్లు రిమ్స్ పెద్దలను కలిసి చెప్పినా స్పందించడం లేదు. ఏమైనా అంటే ఉన్నతాధికారులతో మాట్లాడండి అంటున్నారు. ఎందుకిలా చేస్తున్నారో అర్థం కావడం లేదు.
 - జీఎండీ రాసిక్ ఉలేమాన్, హౌస్ సర్జన్, రిమ్స్

మరిన్ని వార్తలు