తాగునీటిపై ‘తోడేయండి’!

16 Sep, 2013 03:49 IST|Sakshi
తాగునీటిపై ‘తోడేయండి’!
సాక్షి, హైదరాబాద్: పట్టణాలు, నగరాలనే తేడా లేకుండా సేవా చార్జీల మోత మోగిపోనుంది. మంచినీటి, మురుగునీటి పారుదల సేవల చార్జీలు పెంచేయాల్సిందిగా రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆదేశించింది మరి! ఈ మేరకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకూ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి సుధీర్ కృష్ణన్ ఇటీవలే లేఖ రాశారు. దేశంలో మంచినీటి, మురుగునీటి పారుదల సేవలకు వసూలు చేసే చార్జీలపై పూర్తిస్థాయిలో అధ్యయనం అనంతరం ఆయన ఈ లేఖ రాశారు. చేస్తున్న వ్యయాన్ని రాబట్టుకోలేకపోతే పథకం మనుగడే ప్రశ్నార్థకం అవుతుందని అందులో హెచ్చరించారు. స్థానిక సంస్థలు ఆర్థికంగా నిలదొక్కుకోవాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు. పథకాల వ్యయాన్ని పూర్తిగా రాబట్టుకోలేకపోయినా కనీసం అమలు, నిర్వహణ (ఓ అండ్ ఎం) వ్యయాలనైనా పూర్తిగా రాబట్టాల్సిందేనని స్పష్టం చేశారు. అందులో రాష్ట్రాలకు ఇచ్చిన ఆదేశాలివీ...
 
  •   ప్రతి కనెక్షన్‌కూ విధిగా మీటర్లు ఏర్పాటు చేయాలి
  •   దేశంలోని మొత్తం 7,935 పట్టణాలు/నగరాల్లో కేవలం 5 పట్టణాలు మాత్రమే తాగునీటి సరఫరా వ్యయాన్ని చార్జీల రూపంలో పూర్తిగా వసూలు చేస్తున్నాయి. 16 నగరాల్లో 65 శాతం వసూలవుతోంది.
  •   మంచినీటి చార్జీల పెంపుతో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఉండేందుకు వీలుగా పురపాలక సేవల నియంత్రణ సంస్థ (మున్సిపల్ సర్వీస్ రెగ్యులేటర్ అథారిటీ)ని ఏర్పాటు చేసుకోండి
  •   మీటర్లు లేని చోట ఇంటి స్థల విస్తీర్ణం ఆధారంగా చార్జీలు వసూలు చేయండి.  100 చదరపు గజాల్లోపు విస్తీర్ణం, 900 చదరపు అడుగుల ఇల్లుంటే నెలకు రూ.60, 100-200 చ.గ.లోపు విస్తీర్ణం, 1,000 చ.అ. లోపు బిల్టప్ ఏరియా ఉంటే రూ.150, 200 చ.గ. కంటే ఎక్కువ విస్తీర్ణం, 1,500 చ.అ. లోపు బిల్టప్ ఏరియా ఉంటే రూ.250, 300 చ.గ. విస్తీర్ణంలో 1,500 చ.అ.. కంటే ఎక్కువ బిల్టప్ ఏరియా ఉంటే రూ.400 చొప్పున ప్రతి కనెక్షన్‌కూవసూలు చేయాలని స్పష్టం చేశారు. వాణిజ్య, పరిశ్రమలకైతే ఈ చార్జీలు మరీ అధికంగా ఉండాలని పేర్కొన్నారు. నీటి వాడకం ఒక శ్లాబు నుంచి మరో శ్లాబుకు పెరిగితే మొత్తం వినియోగంపైనా అధిక చార్జీలను వసూలు చేయాలని తెలిపారు. ప్లాటు విస్తీర్ణం లాగే మంచినీటి కనెక్షన్ తీసుకున్న పైపు పరిమాణం ఆధారంగా కూడా  చార్జీలు వసూలు చేయవచ్చన్నారు. 15 ఎంఎం కనెక్షన్‌కు నెలకు రూ. 50, 20 ఎంఎం అయితే రూ. 75 వసూలు చేసుకోవచ్చు.
  •   మురుగునీటి పారుదల సేవల చార్జీలను మంచినీటి చార్జీల్లో కనీసం 50 శాతం చొప్పున వసూలు చేయండి. వీటిని ఆస్తి పన్నులో భాగంగానే వసూలు చేస్తున్నారు. అలాకాకుండా విడిగా వసూలు చేయాలి
  •   నీటి చార్జీలు పెంచడం వల్ల పెరుగుతున్న మంచినీటి వినియోగాన్ని తగ్గించవచ్చు
>
మరిన్ని వార్తలు