విజయవాడ: బెజవాడ నగరంపై వరుణుడు తన ప్రతాపం చూపించాడు. శనివారం సాయంత్రం నుంచి ఇవాళ ఉదయం వరకూ కురుస్తున్న వర్షంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. నగరంలోని వన్ టౌన్, భవానిపురం, పాల ఫ్యాక్టరీ ఏరియా, సూర్యారావు పేట, సత్యనారాయణపురం, ఏపీఐఐసీ కాలనీ, ఆటో నగర్ ప్రాంతాల్లో వర్షం కారణంగా నీరు రోడ్ల పైకి చేరింది. వాన నీటిని మళ్ళించే డ్రైనేజీలు పూడిపోవడంతో వర్షపు నీరు పల్లపు ప్రాంతాల్లో కి చేరింది. పలు రహదారుల మీద కూడా వర్షపు నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందుల పాలయ్యారు. దుకాణాలు, ఇళ్ల ముందుకు వర్షపు నీరు చేరి జలమయంగా మారడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. కాగా నైరుతి రుతు పవనాల ప్రభావంతో శనివారం నుంచి కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లోని పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి.