కలుషితమై'నది'..

2 Jun, 2018 11:44 IST|Sakshi
పేపర్‌ మిల్లు నుంచి కాలువ ద్వారా గోదావరి నదిలోకి వస్తున్న రసాయనిక వ్యర్థ జలాలు

నదిలో కలుస్తున్న పేపర్‌ మిల్లు రసాయన జలాలు

కోటిలింగాల ఘాట్‌ వద్ద నేరుగా నదిలోకి వ్యర్థాలు

పత్తాలేని జల కాలుష్య మండలి అధికారులు

సాక్షి, రాజమహేంద్రవరం: ఉభయగోదావరి జిల్లాలకు సాగు, తాగునీటిని అందిస్తున్న గోదావరిని కాలుష్యం కాటేస్తోంది.  రాజమహేంద్రవరంలో ఉన్న ఇంటర్‌నేషనల్‌ పేపర్‌ మిల్లు ద్వారా రసాయనిక వ్యర్థ జలాలు నేరుగా గోదావరిలో కలుస్తున్నాయి. అయినా పర్యావరణ, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు  అటువైపు కన్నెత్తి చూడడంలేదు. స్థానిక నగరపాలక సంస్థ, రెవెన్యూ అధికారులు కాలుష్య నియంత్రణ పని తమది కాదంటూ తప్పుకుంటున్నారు.

నేరుగా నదిలోకి..
రసాయనిక వ్యర్థాలు, తెల్లటి నురగలు చిమ్ముతూ పేపర్‌ మిల్లు నుంచి కోటిలింగాల శ్మశానవాటిక వద్దకు కాలువ ద్వారా నేరుగా నదిలో కలుస్తున్నాయి. ప్రస్తుతం గోదావరిలో ఇన్‌ఫ్లో చాలా తక్కువగా ఉంది. వరదల సమయంలో కాలుష్య జలాల ప్రభావం పైకి కనిపించకపోయినా వేసవిలో మాత్రం స్పష్టంగా వాటి ప్రభావం తెలుస్తోంది. కోటిలింగాల శ్మశాన వాటిక నుంచి పుష్కరఘాట్‌ వరకు గోదావరి జలాలు నల్లగా రంగుతేలాయి. గోదావరి నీటినే ఇటీవల ఉభయగోదావరి జిల్లాల్లోని తాగునీటి ట్యాంకులు, చెరువులకు నింపారు. అందు కోసం జిల్లాలో తూర్పు, మధ్య డెల్టా కాలువలను నాలుగు రోజులపాటు, పశ్చిమ గోదావరికి వెళ్లే పశ్చిమ డెల్టా కాలువను పది రోజులపాటు అదనంగా నీటిని విడుదల చేశారు. ఆ నీటిని స్థానిక నీటి శుద్ధి ప్లాంట్లు ద్వారా బ్లీచింగ్, ఆలం కలిపి నీటిలో పీహెచ్‌ స్థాయి ఏడు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కానీ నీటిలో ఉండే రసాయనిక గుణాలను తొలగించేలా ఎలాంటి ఏర్పాట్లు లేవు. పైగా నీటిలో రసాయనిక గుణాలను గుర్తించే వ్యవస్థే నగర, పరపాలికలు, పంచాయతీల్లో ఉండే తాగునీటి విభాగం వద్ద లేకపోవడం గమనార్హం.

పేపర్‌ మిల్లు వాడకం 23వేల కిలో లీటర్లు...
కోటిలింగాలఘాట్‌ వద్ద నదిలో ఏర్పాటు చేసిన ఇన్‌టేక్‌ పాయింట్‌ నుంచి పేపర్‌ మిల్లు ప్రతిరోజూ 23 వేల కిలో లీటర్ల నీటిని ఉపయోగించుకుంటోంది. వివిధ దశల్లో దాదాపు 40 రకాల రసాయనాలను ఉపయోగించి పేపర్‌ తయరీ తర్వాత ఆ నీటిని వెంకటనగరం పంచాయతీ పరిధిలోని లంకల్లో అధికారికంగా, కోటిలింగాల ఘాట్‌ వద్ద అనధికారికంగా విడుదల చేస్తున్నారు. కోటిలింగాలఘాట్‌ వద్ద ఉన్న 10 ఎంఎల్‌డీ ప్లాంటుతోపాటు మరో మూడు ప్లాంట్ల ద్వారా నగరంలోని దాదాపు ఐదు లక్షల మంది జనాభాకు ప్రతి రోజూ 65 మిలియన్‌ లీటర్లు(ఒక మిలియన్‌= 10 లక్షల లీటర్లు) నగరపాలక సంస్థ సరఫరా చేస్తోంది. వాటర్‌ ప్లాంట్లలో సాధారణ ప్రక్రియలో బ్లీచింగ్, క్లోరినేషన్‌ చేసి సరఫరా చేస్తున్నారు. ఈ ప్రక్రియ ద్వారా రసాయనిక వ్యర్థాలను పూర్తి స్థాయిలో తొలగిపోవని రసాయన శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

రసాయన వ్యర్థాలు నీటిలో కలిస్తే వచ్చే వ్యాధులు...
రసాయన వ్యర్థ జాలాలు తాగునీటిలో కలవడం వల్ల ప్రాణాంతకమైన వ్యాధులతోపాటు మానవ అవయవాలపై తీవ్ర దుష్ప్రభావం పడుతుందని వైద్యనిపుణులు పేర్కొంటున్నారు. రసాయనిక వ్యర్థాల వల్ల మానవ శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. జీర్ణ, శ్వాసకోస వ్యాధులు, ఊపిరి తిత్తులు, కాలేయం, మూత్రపిండాలపై దుష్ప్రభావం పడుతుంది. క్యాన్సర్, కళ్లకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అంతే కాకుండా జల చరాలు ఆ నీటిలో మనుగడ సాగించలేవు. బైలాజికల్‌ ఆక్సిన్‌ డిమాండ్‌ కలవడం వల్ల నీటిలోని చేపల ప్రత్యుత్పత్తి వ్యవస్థ దెబ్బతిని క్రమంగా చనిపోతాయి. కోటిలంగాల ఘాట్‌ వద్ద రసాయన వ్యర్థ జాలాలు కలిసే ప్రాంతం చుట్టు పక్కల చేపలు సంచరించడంలేదు. మత్యశాఖ గత ఏడాది నవంబర్‌లో దాదాపు రెండు కోట్ల చేప పిల్లలను వేసినా అవి ఇక్కడ జీవించే అవకాశం లేకపోవడంతో పాపికొండలు, పోలవరం లాంటి సుదూర ప్రాంతాలకు వెళ్లిపోయాని మత్య్సకారులు వాపోతున్నారు.

పేపర్‌ తయారీలో వాడే రసాయనాలు ఇవీ
పేపర్‌ తయరీకి దాదాపు 40 రకాల రసాయనాలను ఉపయోగిస్తున్నారు. సల్ఫర్‌ డై ఆక్సైడ్, కార్బన్‌ మోనాక్సైడ్, హైడ్రోజన్‌ పెరాక్సైడ్, డై మిథైల్‌ సల్ఫేడ్, సల్ఫర్‌ డై ఆక్సైడ్, పేపర్‌సోడియం హైపోక్లోరైట్, సోడియం పెరాక్సైడ్‌ సోడియం సిలికేట్, సోడియం సల్ఫేట్, సోడియం థియో సల్ఫేట్, గ్‌లైకోసైడ్, సల్ఫర్, టిటానియం డాక్సైడ్, హైడ్రోజన్‌ పెరాక్సైడ్, కాల్షియం కార్పొనేట్, మెగ్నీషియం బిసిల్‌ఫైట్, మెగ్నీషియం కార్భోనేట్, మెగ్నీషియం హైడ్రాక్సైడ్, ఆక్సిజన్, ఓజోన్, అబీటిక్‌ యాసిడ్, సోడియం అబీటిక్, సోడియం సల్ఫేట్, సోడియం బిసిల్‌ఫైట్, సోడియం కార్పొనేట్, సోడియం అల్యూమినేట్, సోడియం బిసిల్‌ఫేట్, సోడియం క్లోరేట్, సోడియం హైడ్రో సల్ఫేట్, నేచురల్‌ సల్ఫేట్‌ ఆఫ్‌ లైమ్, ఆల్కైల్‌ కీటోన్‌ డైమర్, కాల్షియం సల్ఫేట్, సల్ఫేట్‌ ఆఫ్‌ అలుమినా, ఇథలిన్‌ డైమిన్‌ టెట్రా ఎసిటిక్‌ ఆమ్లం, ఫామాడిన్, న్యాచురల్‌ ఫామాడిన్, పాలమర్, బైలాజికల్‌ ఆక్సిన్‌ డిమాండ్‌ తదితర రసాయనాలు పదార్థాలు ఉపయోగిస్తున్నారు.

మరిన్ని వార్తలు