పవర్‌ పెట్రోల్‌కు బదులు నీరు

15 Nov, 2018 08:11 IST|Sakshi
పవర్‌పెట్రోల్‌లో నీటిని చూపుతున్న మోహనరావు , పవర్‌పెట్రోల్‌లో నీరు

చర్యలు చేపట్టాలని వినియోగదారులు డిమాండ్‌

విజయనగరం ,బొబ్బిలి రూరల్‌ : విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలో జేసీ ఫిల్లింగ్‌ స్టేషన్‌(పెట్రోల్‌బంక్‌)లో పవర్‌ పెట్రోల్‌లో నీరు కలిసింది. బుధవారం మధ్యాహ్నం బాటిల్స్‌లో పవర్‌పెట్రోల్‌ కొనుగోలు చేసిన బొబ్బిలికి చెందిన పప్పల చంద్రశేఖర్, ఎం.బూర్జవలసకు చెందిన గేదెల గౌరునాయుడు, జగన్నాథపురానికి చెందిన టి.జీవన్‌కుమార్, బొబ్బిలికి చెందిన వి.మోహనరావులకు ఆయిల్‌లో నీరుకలిసి ఉండడంతో మేనేజర్‌ శేఖర్‌ దృష్టికి తీసుకువచ్చారు. ఇలా అయితే వాహనాలు పాడైపోతాయని, తక్షణమే యాజమాన్యంపై చర్యలు చేపట్టాలని వినియోగదారులు డిమాండ్‌ చేశారు. కాగా జేసీ ఫిల్లింగ్‌ స్టేషన్‌ మేనేజర్‌ శేఖర్, యజమాని శ్రీనివాసరావు దీనిపై వివరణ ఇస్తూ ఉదయమే ట్యాంక్‌ వచ్చిందని, తాము శాంపిల్స్‌ తీశామని, అప్పుడు ఎలాంటి సమస్యలేదని మేనేజర్‌ తెలిపారు. ఈ విషయంలో తమ తప్పిదంలేదని, విశాఖలో హెచ్‌పీ సేల్స్‌మేనేజర్‌ దృష్టికి ఈ సమస్య తీసుకెళతామని, తాము దీనిపై చర్యలు చేపడతామని తెలిపారు. పవర్‌ సేల్స్‌ నిలిపివేసి, సమస్య వచ్చిన వారికి పెట్రోల్‌ తిరిగి అందించారు.

మరిన్ని వార్తలు