ట్రిపుల్‌ఐటీలో నీటి పాట్లు

12 Mar, 2018 11:51 IST|Sakshi
ట్రిపుల్‌ఐటీలో ఏర్పాటు చేసిన ట్యాంకర్లు

నెల రోజులుగా అరకొరగా కృష్ణా జలాలు

విద్యార్థులకు ఇబ్బందులు

నూజివీడు :  పట్టణంలోని ట్రిపుల్‌ఐటీలో నీటి సమస్యతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. అవసరాలకు నీళ్లు సరి పడా రాకపోవడంతో తరగతులకు సై తం ఆలస్యంగా వెళ్లాల్సివస్తోంది. నూజి వీడు ట్రిపుల్‌ఐటీలో ఉన్న నూజివీడు, శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీలకు సంబంధించిన విద్యార్థులు 8500 మంది ఉన్నారు. వీరితో పాటు మరో వెయ్యి మంది వరకు సిబ్బంది, వారి కుటుంబ సభ్యులున్నారు. విద్యార్థులకు వండి పెట్టడానికి 8 మెస్‌లు ఉన్నాయి. నీటి సమస్య కారణంగా ముఖ్యంగా విద్యార్థులకు కాలకృత్యాలు తీర్చుకోవడానికి తీవ్ర జాప్యం కలుగుతోంది. ఉదయం 8.30 గంటల కల్లా తరగతులకు వెళ్లాల్సి ఉండటం, ఆలస్యంగా వెళ్లితే తరగతులకు రానివ్వని నేపథ్యంలో హాస్టల్‌ గదులకే పరిమితం కావాల్సి వస్తోంది. 

కృష్ణా జలాల అరకొర సరఫరానే కారణమా..?
ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లో ఉంటున్న విద్యార్థులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు ఉన్న 9,500 మందికి ప్రతి రోజూ దాదాపు 10 నుంచి 12 లక్షల లీటర్ల నీళ్లు అవసరమవుతాయి. అయి తే క్యాంపస్‌లో 22 బోర్లు ఉన్నప్పటికీ చాలినన్ని నీళ్లు అందించలేని పరిస్థితుల్లో ట్రిపుల్‌ఐటీ అధికారులు నూజివీడు మున్సిపాలిటీతో కృష్ణా జలాల సరఫరాకు సంబంధించి రెండేళ్ల క్రితమే ఒప్పందం కుదుర్చుకున్నారు. వెయ్యి లీటర్లకు రూ.36 చెల్లించేలా, రోజుకు 15 లక్షల లీటర్లు సరఫరా చేయాలని ఒప్పందంలో పేర్కొనడంతో పాటు అడ్వాన్స్‌గా ట్రిపుల్‌ ఐటీ నూజివీడు మున్సిపాలిటీకి రూ.98 లక్షలను సైతం ఇవ్వడం జరిగింది. కృష్ణా జలాలను సరఫరా చేసినందుకు గాను ప్రతి నెలా దాదాపు రూ.8 లక్షలు చెల్లిస్తోంది. గత నెల రోజులుగా రోజుకు 15 లక్షల లీటర్లకు గాను, కేవలం 3 నుంచి 4 లక్షల లీటర్ల నీళ్లు మాత్రమే వస్తుండటంతో నీటి సమస్య ఉత్పన్నమైంది.

కృష్ణా జలాల పథకానికి సంబంధించి విజయవాడ నుంచి నూజివీడుకు వచ్చే ప్రధాన పైప్‌లైన్‌ వెంబడి దాదాపు 10 నుంచి 12 చోట్ల లీకేజీలు ఏర్పడి కృష్ణా జలాలు వృథాగా పోతున్నాయి. దీంతో ఇటు పట్టణానికి, అటు ట్రిపుల్‌ ఐటీకి సరిపడా రావడం లేదు. దీంతో ట్రిపుల్‌ ఐటీకి సరఫరా చేయాల్సిన నీటిని తగ్గించేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఏర్పడిన నీటి కొరతను అధిగమించడానికి గాను ట్రిపుల్‌ ఐటీ అధికారులు రెండు ట్యాంకర్లు ఏర్పాటు చేసి బోర్లలోని నీటిని ట్యాంకర్లలో నింపి తీసుకెళ్లి సం పులను నింపుతున్నారు. ఇలా రాత్రి, పగలు కలపి రోజుకు 30 ట్యాంకర్లు వరకు సరఫరా చేస్తుండటంతో ఇబ్బందులు కొద్దిగా మాత్రమే తగ్గాయి. ప్రస్తుతం మార్చి నెలలో పరిస్థితి ఇలా ఉంటే ఏప్రిల్‌లో ఎలా ఉంటుందోనని ట్రిపుల్‌ఐటీ విద్యార్థులు, సిబ్బంది ఆం దోళన చెందుతున్నారు. ఇప్పటికే భూ గర్భ జలాలు పడిపోయిన నేపథ్యంలో ఉన్న బోర్లు ఎంతకాలం ఆడతాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఒకవేళ క్యాంపస్‌లోని బోర్లలో నీళ్లు అడుగంటిపోతే సమీపంలోని మామిడి తోటల్లో ఉన్న బోర్ల నుంచైనా ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని, ఇటీవల సేకరించిన భూమిలో ఉన్న నాలుగు బోర్లను వినియోగంలోకి తీసుకువచ్చే ప్రయత్నాలు ప్రారంభించాలని వీసీ ఆచార్య వేగేశ్న రామచంద్రరాజు ఇంజినీరింగ్‌ అధికారులకు తెలిపారు. 

మరిన్ని వార్తలు