ఓట్ల మోహం.. తీరని దాహం..

10 Apr, 2019 09:52 IST|Sakshi

సాక్షి, వేలేరుపాడు: ఎన్నికల సమయంలో ఓట్ల కోసం ఆ గ్రామానికి కాలినడకన నేతలు వెళతారు. గుక్కెడు నీటి కోసం ఆ గ్రామ కొండరెడ్లు పడుతున్న కష్టాలు కళ్లారా చూస్తారు. కష్టాలు తీరుస్తామని హామీలు ఇస్తారు. అయితే ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆ గ్రామం వైపు కన్నెత్తి చూడకుండా మిన్నకుండి పోతారు. ఇది 50 ఏళ్లుగా నాయకులకు పరిపాటిగా మారింది. వేలేరుపాడు మండలంలోని అటవీ ప్రాంతంలో అత్యంత మారుమూలన ఉన్న కాకిస్‌నూరు గ్రామ దుస్థితి ఇది. ఎలాంటి రహదారి, విద్యుత్‌ సౌకర్యంలేని ఈ గ్రామానికి గోదావరి మార్గం గుండా వెళ్లాల్సిందే. వేలేరుపాడు మండలం టేకుపల్లి దాటాక గోదావరి ఒడ్డునుంచి రెండు కిలోమీటర్లు కాలినడకన ప్రయాణిస్తే పెద్దగుట్టపై ఈ గ్రామం కనిపిస్తుంది. ఇక్కడ 120 కొండరెడ్ల కుటుంబాలు ఉన్నాయి.

గ్రామం ఏర్పడి దాదాపు వందేళ్లు అవుతోంది. గ్రామస్తులు మొదటి నుంచి తాగునీటి కోసం కష్టాలు పడుతూనే ఉన్నారు. గ్రామానికి చేరువలో ఉన్న పాపికొండల కాలువ నీరే వీరికి తాగునీరు. ఈ కాలువ వర్షాకాలంలో ఉధృతంగా ప్రవహిస్తుంది. అయితే ఆ సమయంలో నీరంతా బురద రంగులో ఉండటంతో వీరు తాగరు. వర్షం నీటిని మాత్రమే తాగునీరుగా వినియోగిస్తారు. అదెలా అంటే ఓ పలుచటి గుడ్డను నాలుగువైపులా తాళ్లతో కట్టి మధ్యలో రాయి ఉంచుతారు. దాని కింద బిందె పెట్టి నీళ్లు పట్టుకుంటారు. ఆ నీటిని వర్షాకాలం సీజన్‌లో తాగుతారు. ఆ తర్వాత రోజుల్లో పాపికొండల కాలువ నీరు వీరికి దిక్కు. అటవీ ప్రాంతంలో భారీ గుట్టల నడుమ ఆకులు అలమలు పడి పారే  ఈ కాలువ చెలమల్లో నీటిని తోడుకుని తాగుతున్నారు. చెలమల నుంచి నీటి బిందెలతో మహిళలు గుట్టపైకి ఎక్కుతూ పడరాని పాట్లు పడుతున్నారు. ఈ కలుషిత నీరు తాగడం వల్ల రోగాలబారినా పడుతున్నారు. ఈ గ్రామంలో కనీసం మంచినీటి చేతిపంపు వేయించేందుకు కూడా ఎవరూ ప్రయత్నించిన దాఖలాలు  కూడా లేవు. కొత్త పాలకులు అయినా ఇటుగా దృష్టి సారించాలని వీరంతా కోరుతున్నారు. 

మరిన్ని వార్తలు