8న ‘కడెం’ నీటి విడుదల

16 Dec, 2013 07:04 IST|Sakshi

కడెం, న్యూస్‌లైన్ : కడెం ప్రాజెక్టు ఆయకట్టు భూములకు వచ్చే నెల 8వ తేదీ నుంచి రెండో పంటకు నీరివ్వనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఆయకట్టు నీటి సంఘాలు, రైతు నాయకులతో ఆదివారం స్థానిక విశ్రాంతి భవనంలో సమావేశం నిర్వహించారు. ప్రాజెక్టు ఈఈ వెంకటేశ్వర్‌రావు, డీఈలు శివనాగరాజు, నూరొద్దీన్ హాజరయ్యారు. కుడి, ఎడమ కాలువల ఆయకట్టు కింద పంట భూములకు చివరి దాకా నీరందించాలని రైతులు, నీటి సంఘాల నాయకులు కోరారు. ప్రాజెక్టులోని నీరు సరిపోని పక్షంలో ఎస్సారెస్పీ నుంచి ఆరు టీఎంసీలు తెప్పించాలని అన్నారు. ప్రస్తుతం చివరి వరకు నీరిచ్చే సామర్థ్యం ప్రాజెక్టుకు లేదని, ఉన్న నీటితో ఆయకట్టు కింద కొంతవరకు మాత్రమే రబీకి.. అదీ ఆరుతడి పంటలకే నీరిస్తామని అధికారులు స్పష్టం చేశారు. రైతులు అంగీకరించకపోవడంతో చాలాసేపు అధికారులతో వాడీవేడిగా చర్చ సాగింది.
 
 వారబందీ పద్ధతిన..
ఆయకట్టు కింద డీ-30 వరకు వారబందీ పద్ధతిన నీరిస్తామని, వచ్చే నెల 8వ తేదీన నీటిని విడుదల చేస్తామని ఈఈ వివరిం చారు. దీనిపై సమావేశంలో తీర్మానించా రు. ప్రతీ పది రోజులు కాలువ మూసి ఉం టుందని, రైతులు పూర్తిగా ఆరుతడి పం టలు వేసుకోవాలని, ప్రతీ నీటి చుక్కను పొదుపుగా వాడుకుని అధికారులకు సహకరించాలని రైతులను కోరారు. సమావేశం లో నీటి సంఘాలు, డీసీల చైర్మన్లు జి.మోహన్‌రెడ్డి, శరత్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, సత్యనారాయణ, కొత్త సత్తయ్య, ప్రాజెక్టు జేఈ లు నరేందర్, శ్రీనాథ్, జల సాధన సమితి అధ్యక్షుడు ఎన్.గోవర్ధన్, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు