పెంచి.. పంచుకుందాం!

7 Nov, 2013 02:13 IST|Sakshi

‘చిత్తూరు మంచినీటి’ టెండర్లలో గోల్‌మాల్!
చక్రం తిప్పుతున్న ముఖ్యనేత సోదరుడు
రూ. 2,300 కోట్ల విలువైన మొదటి దశ పనులకు టెండర్ల ఆహ్వానం
వాస్తవ వ్యయానికి 45 శాతం పెంచి అంచనా వ్యయం ఖరారు చేశామని వెల్లడి
ఇందులో 15% చొప్పున కనీసం రూ.300 కోట్ల కమీషన్ ఇవ్వాలని డిమాండ్
టీడీపీ ఎమ్మెల్యేకి సన్నిహితుడైన బడా కాంట్రాక్టర్‌తో కలిసి కాంట్రాక్టర్లతో సంప్రదింపులు
తెలంగాణ బిల్లు సందట్లో టెండర్ల ప్రక్రియ పూర్తి చేసేందుకు హడావుడి
 
సాక్షి, హైదరాబాద్:
చిత్తూరు మంచినీటి ప్రాజెక్టు టెండర్లలో భారీ గోల్‌మాల్ చోటు చేసుకుంటోందా? రూ.2,300 కోట్ల విలువైన మొదటిదశ పనులకు హడావుడిగా టెండర్లను ఖరారు చేసేందుకు ప్రభుత్వ పెద్దలు తహతహలాడుతున్న తీరు చూస్తే ఈ అనుమానాలు కలుగుతున్నాయి. ఈ పనులకు వాస్తవంగా అయ్యే వ్యయం కంటే 45 శాతం ఎక్కువగా అంచనా వ్యయం నిర్ణయించామని కాంట్రాక్టర్లకు చెబుతూ కనీసం రూ.300 కోట్లు కమీషన్ల రూపంలో ఇవ్వాలని ముఖ్యనేత సోదరుడు డిమాండ్ చేస్తున్నారని ఉన్నతాధికారవర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యనేత సోదరునితో పాటు ఓ టీడీపీ ఎమ్మెల్యేకు సన్నిహితుడైన మరో కాంట్రాక్టర్ ఈ టెండర్ల వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్నారు. వారి సూచనల మేరకు కాంట్రాక్టు కట్టబెట్టేందుకు వీలుగా టెండర్, ఆర్థిక నిబంధనలు, అనుభవం వంటి నియమాలను ఖరారు చేయాలని ప్రభుత్వ పెద్దలు సంబంధిత అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు.  
 
అంచనా కంటే 45 శాతం పెంపు!
తెలుగుగంగ ప్రాజెక్టులో భాగమైన కండలేరు రిజర్వాయర్ నుంచి చిత్తూరు జిల్లావ్యాప్తంగా మంచినీటి సరఫరాకు గాను రూ.4,300 కోట్లు వ్యయం కాగల ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. ఈ ప్రాజెక్టుకు పరిపాలన అనుమతిని మంజూరు చేస్తూ ప్రభుత్వం ఇటీవల జీవో జారీ చేసింది. దీంతో మొదటిదశ పనులకు టెండర్లను ఆహ్వానించారు. పైప్‌లైన్  వేయడం, ప్రధాన ట్రంక్ పైప్‌లైన్, సెకండరీ ట్రంక్ పైప్‌లైన్ పనులకు గాను ఈ టెండర్లను పిలిచారు. ఈ నెల 20వ తేదీన గడువు ముగిసిన తర్వాత 21వ తేదీన టెక్నికల్ బిడ్‌లు తెరవనున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యనేత సోదరుడితో పాటు టీడీపీ ఎమ్మెల్యేకు సన్నిహితుడైన కాంట్రాక్టర్ రంగంలోకి దిగారు. పనులు చేపట్టేందుకు ఆసక్తి చూపుతున్న కాంట్రాక్టర్లతో సంప్రదింపులు మొదలుపెట్టారు. పనుల విలువను వాస్తవ వ్యయం కంటే 45 శాతం మేరకు కృత్రిమంగా పెంచి అంచనా వ్యయం రూపొందించామని, అందువల్ల ఇందులో 15 శాతం వరకు కమీషన్ రూపంలో ఇవ్వాలని ముఖ్యనేత సోదరుడు కాంట్రాక్టర్లను డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. అంతేగాకుండా టెండర్ పొందిన తరువాత స్వయంగా పనులు చేపట్టకుండా ఇతరులకు సబ్ కాంట్రాక్టు ఇచ్చినప్పటికీ ఎలాంటి నష్టమూ ఉండబోదని, 25% వరకు లాభం వస్తుందని భరోసా ఇస్తున్నట్టు తెలిసింది. ఎలాంటి అనుమానాలూ రాకుండా పనుల అంచనా విలువ కన్నా ఒకటి లేదా రెండు శాతం మేర తక్కువకు టెండర్‌ను కోట్ చేయాలని కూడా ముఖ్యనేత సోదరుడు కాంట్రాక్టర్లకు సూచించారు. ఇందుకు అంగీకరించిన  కాంట్రాక్టర్లను సిండికేట్‌గా ఏర్పాటు చేసేందుకు టీడీపీ ఎమ్మెల్యేకు సన్నిహితుడైన కాంట్రాక్టర్ పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఆ సిండికేట్‌లోని కాంట్రాక్టర్లే ప్రాజెక్టు టెండర్లలో భాగస్వాములయ్యేలా ప్రభుత్వ పెద్దలు పావులు కదుపుతున్నట్టు సమాచారం. రాష్ట్ర విభజన బిల్లు కార్యరూపం దాల్చేలోగా సందట్లో సడేమియాలా ఈ ప్రాజెక్టు టెండర్లను ఖరారు చేయాలని అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు.
 
అనుకూల అధికారుల నియామకం
ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టుగా టెండర్ల వ్యహారాన్ని నడిపించేందుకే ఇటీవల సంబంధిత శాఖలో అనువైన అధికారులను నియమించారని, అలాగే పదవీ విరమణ చేయాల్సిన ఇంజనీర్ ఇన్ చీఫ్ పదవీ కాలాన్ని పొడిగించారని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. గ్రామీణ మంచినీటి శాఖ ఇంజనీరింగ్ విభాగంలో అనుభవజ్ఞులైన అధికారులున్నప్పటికీ పట్టించుకోకుండా చిత్తూరు మంచినీటి ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను మౌలిక వసతుల కల్పన శాఖకు అప్పగించారు.

>
మరిన్ని వార్తలు