‘ఇక సామాజిక తెలంగాణ కోసం ఉద్యమిస్తాం’

21 Feb, 2014 20:20 IST|Sakshi
‘ఇక సామాజిక తెలంగాణ కోసం ఉద్యమిస్తాం’

హైదరాబాద్: పోరాడి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తాము ఇక రాజ్యాధికారంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు భాగస్వామ్య ఫలాలందే సామాజిక తెలంగాణ కోసం పోరాడతామని తెలంగాణ రాష్ట్రీయ లోక్‌దళ నేత, ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్‌కుమార్ అన్నారు. ఇదే డిమాండ్ మార్చి రెండవ తేదీన హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో సామాజిక తెలంగాణ యుద్ధభేరి సభ నిర్వహించనున్నట్టు చెప్పారు.

ఎస్సీ, ఎస్టీలకు అధికారం ఇవ్వడానికి అగ్రవర్ణాలు అంత సులభంగా అంగీకరించే పరిస్థితి ఉండదని... అందుకే తమ సభకు యుద్ధభేరిగా నామకరణం చేయాల్సి వచ్చిందని చెప్పారు. పార్టీ నేతలతో కలిసి శుక్రవారం ఆయన పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తమ యుద్ధభేరి సభకు పార్టీ జాతీయ అధ్యక్షుడు అజిత్‌సింగ్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ హాజరవుతారని చెప్పారు.

వచ్చే ఎన్నికలలో తాము కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేసే ప్రయత్నం చేస్తున్నామని దిలీప్‌కుమార్ తెలిపారు. తెలంగాణ కోసం అమరులైన వారి కుటుంబాల సభ్యులకు ఎన్నికలలో కొన్ని సీట్లు కేటాయించాలని కోరబోతున్నట్టు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత తమ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తామని కేసీఆరే చెప్పారని.. ఇప్పుడు టీఆర్‌ఎస్ పార్టీ తమలో విలీనం కావాలని కోరుకుంటుందన్నారు. నిర్ణయం తీసుకోవాల్సింది కేసీఆర్‌నేనని అన్నారు.

మరిన్ని వార్తలు