ప్రతి హామీని బాధ్యతగా నెరవేరుస్తున్నాం: సీఎం జగన్‌

21 Nov, 2019 10:26 IST|Sakshi

నేడు వైఎస్సార్‌ మత్స్యకార భరోసా పథకం ప్రారంభం 

సాక్షి, అమరావతి: ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో వైఎస్సార్‌ మత్స్యకార భరోసా పథకాన్ని ప్రారంభించనున్నారు. సముద్రంలో వేట నిషేధం సమయంలో మత్స్యకార కుటుంబాలను ఆదుకునేందుకు గత ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి రూ.4 వేలు చెల్లించేది. దీనిని ఇప్పుడు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఏకంగా రూ.10 వేలకు పెంచింది. ఈ పథకం ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం జగన్‌ తన ఆనందాన్ని ట్విటర్‌ వేదికగా వ్యక్తం చేశారు. ‘దేవుని ఆశీస్సులు, ప్రజల దీవెనలతో ఇచ్చిన ప్రతిహామీని బాధ్యతగా నెరవేరుస్తున్నాం. మత్స్య దినోత్సవం సందర్భంగా వైఎస్సార్ మత్స్యకార భరోసా ద్వారా వేటనిషేధ పరిహారం రూ.10,000,డీజిల్ సబ్సిడీ రూ.9కి పెంపు, వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మరణించిన వారి కుటుంబానికి రూ.10లక్షల పరిహారాన్ని అందిస్తాం.’ అని పేర్కొన్నారు. కాగా పథకంతో రాష్ట్రంలోని 1.35 లక్షల మత్స్యకార కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. మౌలిక సదుపాయాలను ప్రాధాన్యతా క్రమంలో కల్పించడానికి బడ్జెట్‌లో మత్స్య శాఖకు రూ.551 కోట్లు కేటాయించింది. (చదవండిమత్స్యకారులకు ఇక ఆర్థిక సుస్థిరత)

మరిన్ని వార్తలు