‘ఫేస్‌బుక్’ పెళ్లి బెడిసికొట్టింది...

13 Aug, 2013 07:22 IST|Sakshi


 చిగురుమామిడి, న్యూస్‌లైన్ : ఓ యువకుడి ‘ఫేస్‌బుక్’ పెళ్లి బెడిసికొట్టింది. తాను ఫేస్‌బుక్ చాటింగ్ ద్వారా ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతికి అంతకుముందే పెళ్లయి, ఇద్దరు పిల్లలున్నారని తెలిసి బిత్తరపోయాడు. పెళ్లయిన మరునాడే మొదటి భర్త వచ్చి ఆమెను తీసుకుపోవడంతో ఏం చేయా లో తోచని స్థితిలో పడ్డాడు. మండలంలోని లంబాడిపల్లికి చెందిన దాసరి కరుణాకర్ బీటెక్ పూర్తి చేశాడు. ఫేస్‌బుక్‌లో తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంకు చెందిన అక్షరశ్రీ(ఎంకాం)తో పరిచ యం ఏర్పడింది. చాటింగ్ ద్వారా ఆమెతో ప్రేమ లో పడ్డాడు.
 
  గత నెలలో ఇద్దరూ కలిసి తిమ్మాపూర్ మండలంలోని ఎల్‌ఎండీ కాలనీ తాపాళ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. ఆ మరుసటి రోజే ఆమె భర్త సుబ్బారెడ్డి, బంధువులు వచ్చి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసుల సహకారంతో అక్షరశ్రీని తీసుకెళ్లారు. ఆ తర్వాత వారానికే ఆమె కనిపించకుండాపోయింది. దీంతో వారు మళ్లీ ఇక్కడి పోలీసులకు ఫిర్యాదుచేశారు. పోలీసులు కరుణాకర్‌ను విచారిస్తున్నట్లు సమాచారం. అక్షరశ్రీకి రూ. రెండు కోట్ల ఆస్తి ఉన్నట్లు తెలిసింది. ఈ విషయమై ఎస్సై కోటేశ్వర్‌ను సంప్రదించగా తన పరిధిలో లేదని సమాధానం దాటవేశారు.

మరిన్ని వార్తలు