సాక్షి, అమరావతి: పోలీసు వ్యవస్థలో వారాంతపు సెలవు ఓ సంచలన నిర్ణయమని పోలీసు అధికారుల రాష్ట్ర అధ్యక్షుడు జనకుల శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయం హర్షనీయమని, ఆయనకు రాష్ట్రంలోని 60వేల మంది పోలీసులు రుణపడి ఉంటారని చెప్పారు. వీక్లీ ఆఫ్పై 21 మందితో కమిటీ వేశామన్నారు. 150 మంది ప్రతినిధులతో డీజీపీ సమావేశం నిర్వహించారన్నారు. పోలీసులందరికి రేపటి నుంచి వీక్లీ ఆఫ్ అమలు అవుందని చెప్పారు.
పోలీసుల కష్టాన్ని సీఎం జగన్ గుర్తించారు
గతంలో పోలీసులకు వైఎస్సార్ జూనియర్ అసిస్టెంట్ గ్రేట్ కల్పిస్తే.. నేడు ఆయన తనయుడు వైఎస్ జగన్ వీక్లీ ఆఫ్ కల్పించారని పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మస్తాన్ ఖాన్ అన్నారు. సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన హామీని పూర్తి స్థాయిలో అమలు చేయాలని పోలీసు డిపార్ట్మెంట్ కృత నిశ్చయంతో ఉందన్నారు. పోలీసు శాఖలో 19 ఫార్ములాలను నిర్ణయించారని, దాని ప్రకారం వీక్లీ ఆఫ్ వర్తింపజేస్తామన్నారు. నోడల్ ఆఫీసర్గా అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారి బాధ్యత వహిస్తారని చెప్పారు. పాదయాత్రలో తమ కష్టాలను స్వయంగా చూసిన సీఎం వైఎస్ జగన్.. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే వీక్లీ ఆఫ్పై స్పందించడం హర్షనీయమని పోలీసు సంఘం గౌరవ అధ్యక్షుడు నర్రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. తమ పట్ల సానుభూతిగా వ్యవహరిస్తున్న సీఎం వైఎస్ జగన్కు పోలీసులందరు రుణపడి ఉంటారని తెలిపారు.