ఓటేస్తే పైసలిస్తనంటివి?

2 Aug, 2013 04:05 IST|Sakshi

బుద్దారం (పెద్దేముల్), న్యూస్‌లైన్: పంచా యతీ ఎన్నికల్లో ఓటు వేస్తే ఇస్తామన్న డబ్బు లు ఇవ్వలేదంటూ నూతన సర్పంచ్ ఇంటి ఎదుట ఓ వ్యక్తి పురుగు మందు డబ్బాతో హల్‌చల్ చేశాడు. వివరాల్లోకి వెళితే.. పెద్దేముల్ మండల పరిధిలోని బుద్దారం గ్రామ పంచాయతీలో సర్పంచ్ పదవికి టీడీపీ, కాంగ్రెస్ బలపర్చిన ఇద్దరు అభ్యర్థులు పోటీపడ్డారు. అందులో టీడీపీ మద్దతు పలికిన అభ్యర్థి రాయపల్లి మాధవి గెలుపొందారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. గురువారం ఉదయం 9 గంటల సమయంలో అదే గ్రామానికి చెందిన భ్యాగరి బసలింగప్ప తన భార్యను తీసుకొని సర్పంచ్ మాధవి ఇంటికి వచ్చాడు. ఎన్నికల్లో ఓటువేస్తే ఇస్తామన్న డబ్బు లు ఇంకా ఇవ్వలేదని, వెంటనే ఇవ్వాలని పట్టుబట్టాడు. లేకపోతే పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంటానంటూ హల్‌చల్ చేశాడు. దీంతో భయపడ్డ సర్పంచ్ కుటుంబ సభ్యులు గ్రామ పెద్దలకు, పోలీసులకు విషయాన్ని తెలియచేశారు. పోలీసులు అక్కడికి చేరుకొని బసలింగప్పను స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడ పోలీసులు అతడికి కౌన్సెలింగ్ నిర్వహించడంతో బసలింగప్ప ఆత్మహత్యాయత్నం మానుకొని ఇంటిదారిపట్టాడు.

మరిన్ని వార్తలు