విప్ జారీ అధికారం కృష్ణదాస్‌కు

30 Jun, 2014 03:08 IST|Sakshi
విప్ జారీ అధికారం కృష్ణదాస్‌కు

 నరసన్నపేట: వచ్చే నెల మొదటి వారంలో జరగనున్న స్థానిక సంస్థల అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలకు సంబంధించి సభ్యులకు విప్ జారీ చేసే అధికారాన్ని వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌కు ఆ పార్టీ అప్పగించింది. జూలై 3న మున్సిపల్, 4న ఎంపీపీ, 5న జె డ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల సందర్భంగా వైఎస్‌ఆర్‌సీపీ సభ్యులు ఎవరికి ఓటు వేయాలో నిర్దేశిస్తూ కృష్ణదాస్ విప్ జారీ చేస్తారు. దానికి అనుగుణంగా సభ్యులు వ్యవహరించాల్సి ఉంటుంది. విప్‌ను ధిక్కరించేవారు తమ పదవులు కోల్పోయే అవకాశం ఉంది. దీనిపై ఆదివారం కృష్ణదాస్ మాట్లాడుతూ తనకు ఈ అధికారం ఇచ్చినందుకు పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు విప్‌కు బద్దులయ్యేలా కృషి చేస్తానన్నారు.
 
 నేడు నరసన్నపేటలో జిల్లా సమావేశం
 కాగా నరసన్నపేటలో సోమవారం సాయంత్రం 4 గంటలకు తన కార్యాలయంలో జిల్లా పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేసినట్లు కృష్ణదాస్ చెప్పారు. పార్టీ సమన్వయకర్తలు, నియోజకవర్గ ఇన్‌చార్జీలు, మండలాల కన్వీనర్లు, అన్ని విభాగాల కన్వీనర్లు, జడ్‌పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, ఇతర ముఖ్య నేతలు హాజరుకావాలని ఆయన పిలుపునిచ్చారు.
 

మరిన్ని వార్తలు