చిత్తూరుకు కత్తి మహేశ్ తరలింపుపై పోలీసుల స్పందన
సాక్షి, తిరుపతి : తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న సినీ విమర్శకుడు కత్తి మహేశ్పై హైదరాబాద్ పోలీసులు నగర బహిష్కరణ వేటు వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసులు కత్తి మహేశ్ను అదుపులోకి తీసుకొని.. చిత్తూరు జిల్లాకు తరలిస్తున్నట్టు సమాచారం అందుతోంది.
మరికాసేపట్లో చిత్తూరు జిల్లా ఎర్రవారిపల్లి మండలంలోని ఆయన స్వగ్రామం ఎలమండకు మహేశ్ను తీసుకెళ్లి వదిలిపెట్టనున్నారని సమాచారం. అయితే, కత్తి మహేశ్ను జిల్లాకు తరలిస్తున్న విషయాన్ని చిత్తూరు పోలీసులు ఖండిస్తున్నారు. ఈ విషయమై మదనపల్లె డీఎస్పీ చిదానందరెడ్డిని ఆరాతీయగా.. ‘అసలు కత్తి మహేశ్ ఎవరు’ అంటూ స్పందించారు. కత్తి మహేశ్ను జిల్లాకు తీసుకువస్తునట్లు తమకు ఎలాంటి సమాచారం లేదని, ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ కూడా తమకు చెప్పలేదని డీఎస్పీ తెలిపారు.