-

సీఎం జగన్‌ పోలవరం ఎందుకు వెళుతున్నారు?

20 Jun, 2019 11:44 IST|Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌ వరప్రదాయినిగా పేరుగాంచిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను క్షేత్ర స్థాయిలో స్వయంగా ఆయన పరిశీలించనున్నారు. తన తండ్రి, దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో పోలవరం పనులు శ్రీకారం చుట్టినా తర్వాత వచ్చిన టీడీపీ సర్కారు పట్టించుకోకపోవడంతో ప్రాజెక్టు ఆలస్యమవుతూ వచ్చింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది. చంద్రబాబు కమీషన్ల కక్కుర్తితో ప్రాజెక్టు పనులు మందగించాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ​ విజయం సాధించి తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పోలవరంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రాజెక్టు నిర్మాణాన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగా కేంద్ర సాయాన్ని కూడా కోరారు. వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు ప్రాజెక్టును సందర్శించాలని సీఎం వైఎస్‌ జగన్‌ నిర్ణయించారు. ప్రత్యక్షంగా ప్రాజెక్టు నిర్మాణ పనులు చూసిన తర్వాత అధికారులకు ఆయన దిశానిర్దేశం చేయనున్నారు.

చదవండి: పోలవరం ప్రాజెక్టుపై వైఎస్‌ జగన్‌ ప్రత్యేక దృష్టి పెట్టడానికి కారణమేంటి?

ఆంధ్రప్రదేశ్‌ రూపురేఖలు మార్చే పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలంటూ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు వైఎస్ జగన్‌ టీడీపీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చారు. 2018 నాటికి ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామని అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చిన టీడీపీ ప్రభుత్వం మాట నిలబెట్టుకోలేకపోయింది. 2018 నాటికి గ్రావిటీతో నీరు ఇస్తాం రాసుకోమంటూ అప్పటి జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా అసెంబ్లీలో వెటకారంగా మాట్లాడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి వరకూ ప్రాజెక్టు పూర్తి కాలేదు. నిర్వాసితులను పూర్తిస్తాయిలో తరలించి, ప్రాజెక్టు ఆయకట్టుకు నీరు ఇవ్వగలిగితేనే ప్రాజెక్టు పూర్తయినట్లు. లక్షా ఐదు వేల కుటుంబాలకు పునరావాసం కల్పించాల్సి ఉండగా, ఇప్పటి వరకూ 3 వేల కుటుంబాలకు మాత్రమే పునరావాసం కల్పించారు. అంటే 3 శాతంలోపు మాత్రమే పునరావాస కార్యక్రమాలు జరిగాయి. చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. గత ప్రభుత్వ పెద్దలు రోజువారీ సమీక్షలతో సరిపెట్టారు. 

చదవండి: పునాదుల్లోనే పోలవరం ఎందుకు ఉంది?

ఆంధ్రప్రదేశ్‌ వరప్రదాయిని అయిన పోలవరం ఎంతటి నిర్లక్ష్యానికి గుర్యయిందో అందరికీ తెలిసిందే. గడిచిన ఐదేళ్లలో పోలవరాన్ని డబ్బులిచ్చే ఏటీఎమ్‌గానే చూసిన టీడీపీ ప్రభుత్వం ఏనాడూ ప్రాజెక్ట్‌ను పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టలేదు. ఐదేళ్లలో పోలవరాన్ని పూర్తి చేస్తానని ప్రగల్భాలు పలికిన చంద్రబాబు.. ఐదేళ్ల కాలంలో ఏమీ చేయలేక చేతులు ముడుచుకుని కూర్చున్నారు. రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీ ప్రకారం యుద్ధప్రాతిపదికన పూర్తి కావాల్సిన ప్రాజెక్టు అది. చట్ట ప్రకారం వ్యవహరించి ఉంటే ఇప్పటికే ఆ ప్రాజెక్టు పూర్తయ్యేది. 7.2 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుతోపాటు కృష్ణా డెల్టాలో 13.08 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగేది. 960 మెగావాట్ల జలవిద్యుత్‌ అందుబాటులోకి వచ్చేది. విశాఖపట్నంలో తాగు, పారిశ్రామిక నీటి అవసరాలు తీరడంతోపాటు 540 గ్రామాల ప్రజల దాహార్తి తీరేది.

చదవండి: పోలవరం ప్రాజెక్టును ‘ఏటీఎం’గా మార్చుకున్న చంద్రబాబు

మరిన్ని వార్తలు