సాక్షి, హైదరాబాద్: భద్రాచలం డివిజన్లోని 200 ముంపు గ్రామాలను సీమాంధ్రలో కలపడంపై మహాజన సోషలిస్టు పార్టీ (ఎంఎస్పీ) అధినేత మంద కృష్ణమాదిగ మండిపడ్డారు. శని వారం ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ పది జిల్లాల ఎంఎస్పీ నాయకుల, కార్యకర్తల సదస్సు జరిగింది. అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ భూస్వాములు, సీమాంధ్ర పెట్టుబడిదారుల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారమే రాష్ట్ర విభజన జరిగిందన్నారు. ముంపు గ్రామాల్లో నివసిస్తున్న 3 లక్షల మంది ఆదివాసీలను టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్రావు సీమాంధ్రులకు బలిచ్చారని పేర్కొన్నారు. ఆదివాసీ గ్రామాలపై కేసీఆర్ మౌనం వహించడం దారుణమన్నారు. పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టును నమస్తే తెలంగాణ ఎండీ సి.లక్ష్మీరాజానికి కట్టబెట్టడానికే ఆదివాసీలను బలిపశువులను చేశారని విమర్శించారు.