భర్త మరణంతో భార్య ఆత్మహత్యాయత్నం

6 Dec, 2019 08:52 IST|Sakshi
మనస్తాపంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన రంజిత, భద్రగిరి ఆసుపత్రిలో వైద్య సేవలు పొందుతున్న చిన్నారి ధార్మిక 

సాక్షి, పార్వతీపురంటౌన్‌: కట్టుకున్నవాడు కడదాకా తోడుంటాడని అనుకుంది. తన జీవితానికి చుక్కానిగా ఆదుకుంటాడని ఆశపడింది. వారి అన్యోన్యతకు గుర్తుగా కలిగిన బిడ్డను చక్కగా పెంచుకోవాలని ఉబలాటపడింది. కానీ దురదృష్టం వెంటాడింది. భర్త అనారోగ్యంతో వారం రోజుల క్రితమే కన్నుమూశాడు. ఇంటికి పెద్ద దిక్కుగా ఉంటాడని భావిస్తే అర్ధంతరంగా తనువు చాలించాడు. తన జీవితాన్ని చీకటి మయం చేశాడు. ఆయన లేని లోకంలో ఇక జీవించలేనని నిర్థారించుకుంది. అంతే నా... తల్లీ, తండ్రీ ఇద్దరూ పోతే ఆ బిడ్డను సాకేదెవరని భావించింది. అంతే అనుకున్నదే తడవుగా తాను తాగిన పురుగుల మందునే ఏడాది బిడ్డకు పెట్టింది. అదృష్టవశాత్తూ దగ్గర బంధువులు సకాలంలో స్పందించడంతో ఇప్పుడు ఆస్పత్రిలో ప్రాణాపాయం నుంచి బయటపడింది. ఇదీ గుమ్మలక్ష్మీపురం మండలం లక్కగూడ గ్రామానికి చెందిన రంజిత అనే యువతి విషాద గాథ.  

అసలేమైందంటే... 
రంజితకు రెండేళ్ల క్రితమే లక్కగూడకు చెందిన పాలక కామేశ్వరరావుతో వివాహమైంది. వారి కి ఏడాది వయసున్న ధారి్మక అనే పాప ఉంది. ఇద్దరూ కష్టపడి పనులు చేసుకుంటూ గుట్టుగా కాపురం చేసుకుంటున్నారు. వీరి అన్యోన్యత చూసి విధికి కన్నుకుట్టిందో ఏమో కామేశ్వరరావుకు మాయదారి రోగం పీడించి వారం క్రితమే ప్రాణాలు తోడేసింది. ఇక చిన్నారి పాపతో రంజిత ఒంటరయింది. భర్త లేకపోవడంతో తానెందుకు బతకాలని నిర్ణయించుకుంది. అంతే ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందును నీటిలో కలుపుకుని తాగి... కుమార్తెకూ కొంత తాగించింది. ఇంట్లో చిన్నారి గుక్కపట్టి ఏడుస్తుండటంతో గమనించిన ఇరుగు పొరుగు వారు ఇంట్లోకి వెళ్లి చూడగా పురుగుల మందు తాగినట్లు గుర్తించారు. హుటా హుటిన భద్రగిరి సామాజిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడి వైద్య సిబ్బంది వైద్య సేవలు అందించారు. పాప ధా రి్మక పరిస్థితి మెరుగ్గా ఉన్నప్పటికీ రంజిత పరి స్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి రిఫర్‌ చేశారు. ఆస్పత్రిలో అంబులెన్స్‌ లేకపోవడంతో ప్రైవేటు వాహనంలో వారిని పార్వతీపురానికి తరలించాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆమె పార్వతీపురం ఏరియా ఆస్పత్రిలో కోలుకుంటోంది. ఎలి్వన్‌పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

 

మరిన్ని వార్తలు