ప్రియురాలితో దిగిన ఫొటోలను భార్యకు వాట్సప్‌లో

29 Oct, 2019 09:16 IST|Sakshi

సాక్షి, ఓర్వకల్లు: ఇష్టంలేని పెళ్లి చేసుకొన్న భర్త వేధింపులకు తట్టుకోలేక భార్య ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మండల కేంద్రమైన ఓర్వకల్లులో సోమవారం చోటుచేసుకుంది. బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన బండారి సోమన్న కూతురు బండారి సుజితను కర్నూలు మండలం బి.తాండ్రపాడు గ్రామానికి చెందిన కిశోర్‌ అనే వ్యక్తితో రెండేళ్ల క్రితం వివాహం జరిపించారు. కిశోర్‌ ఓ ప్రైవేట్‌ ఉద్యోగం చేసేవాడు. పెళ్లయిన ఏడాదికే భార్యను వేధింపులకు గురిచేయడం మొదలుపెట్టాడు. దీంతో రెండు సార్లు పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టి తల్లితండ్రులు తమ కూతురు కాపురాన్ని చక్కపెట్టాలని భావించారు.

అయితే కిశోర్‌కు పెళ్లికి ముందుగానే మరో మహిళతో వివాహేతర సంబంధం ఉన్నట్లు భార్యకు తెలియడంతో వేధింపులు మరింత అధికమయ్యాయి. ఇటీవల సుజితకు గ్రామ సచివాలయంలో మహిళా పోలీసు ఉద్యోగం లభించింది. ప్రస్తుతం కోడుమూరు మండలం, పి.కోటకొండ గ్రామంలో విధుల్లో చేరింది. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం కిశోర్‌ తన ప్రియురాలితో దిగిన అసభ్యకరమైన ఫొటోలను భార్య వాట్సప్‌కు పంపాడు. కలత చెందిన సుజిత మూడు రోజుల క్రితం పుట్టింటికి రావడంతో ఆదివారం రాత్రి భర్త కిశోర్‌ నన్నూరు వద్దకు పిలిపించుకొని తనకు ఇష్టంలేదని, విడాకులు ఇవ్వాలని కోరాడు. మనోవేదనతో ఇంట్లో అందరూ నిద్రిస్తున్న సమయంలో  సుజిత పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. కుటుంబ సభ్యులు  చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.   

>
మరిన్ని వార్తలు