ఉసురు తీసిన వివాహేతర సంబంధం

1 May, 2015 04:07 IST|Sakshi
ఉసురు తీసిన వివాహేతర సంబంధం

 భార్యను కడతేర్చిన భర్త
 పోలీసుల అదుపులో నిందితుడు
 కోటనందూరు (తుని) :కలకాలం కలిసి జీవించాల్సిన భార్యాభర్తల మధ్య వివాహేతర సంబంధం చిచ్చురగిల్చింది. భార్యను భర్తే కడతేర్చిన సంఘటన కోటనందూరు మండలం అల్లిపూడిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అల్లిపూడికి చెందిన రుత్తల రాఘవ (45)ను భర్త రుత్తల సత్యనారాయణ అలియాస్ రాంబాబు హత్య చేశాడు. కాకినాడకు చెందిన రాఘవకు అల్లిపూడికి చెందిన సత్యనారాయణతో 23 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
 
 కుమార్తె హేమనిలక్ష్మి విశాఖపట్నంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తోంది. కుమారుడు భాస్కర్ హైదరాబాదులో డిగ్రీ చదువుతున్నాడు. రాఘవకు అదే గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని, బుధవారం అర్ధరాత్రి సమయంలో సత్యనారాయణ ఇంటికి వచ్చిన సమయంలో వీరిద్దరూ కలిసి ఉండడం చూశాడు. దీంతో ఆగ్రహం చెందిన సత్యనారాయణ గట్టిగా కేకలు వేయడంతో బయట వ్యక్తి పలాయనం చిత్తగించాడు. రాఘవ, సత్యనారాయణ ఇద్దరు ఘర్షణ పడ్డారని, పెనుగులాటలో రాఘవ ఇంట్లో ఉన్న రాతిరోలుపై పడిపోవడంతో తల వెనుక భాగంలో తీవ్రగాయమై అక్కడకక్కడే మృతి చెందిందని కోటనందూరు ఎస్సై గోపాలకృష్ణ తెలిపారు.
 
 మృతురాలి సోదరుడు నాళం దుర్గాప్రసాద్ గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తుని రూరల్ సీఐ చెన్నకేశవరావు ఆధ్వర్యంలో ఎస్సై గోపాలకృష్ణ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానిక వీఆర్వో సమక్షంలో పంచనామా చేసి తుని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. నిందితుడు సత్యనారాయణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వివరించారు.
 

మరిన్ని వార్తలు