పుట్టెడు దుఃఖాన్ని దిగమింగుతూ..

31 Mar, 2018 13:27 IST|Sakshi
భర్త దుర్యోధనకు అంత్యక్రియలు చేస్తున్న భార్య సుధారాణి

భర్తకు భార్య  అంత్యక్రియలు

మఖరజోలలో విషాదం

మందస: దాంపత్య జీవితం ప్రారంభమైననాడే భర్త జీవితంలో భార్య సగమవుతుంది. కష్టాల్లో, సుఖాల్లో తోడు ఉంటానని ఒకరినొకరు నమ్ముకుని సాగించిన జీవితంలో అర్థాంతరంగా ఒకరు దూరమైతే ఆ వేదన వర్ణనాతీ తం. భర్త మృతిచెందడంతో భార్యే అంత్యక్రియలు నిర్వహించిన విషాదకర సంఘటన మందస మండలంలోని మఖరజోలలో శుక్రవారం జరిగింది. మఖరజోల గ్రామానికి చెందిన కంచరాన దుర్యోధన ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. కుటుంబం కష్టాల్లో నెట్టుకొస్తోంది. భార్య సుధారాణి భర్తకు తోడుగా శ్రమిస్తోంది. భార్య, భర్తలిద్దరూ ఒకరికి ఒకరు చేదోడుగా ఉంటూ ఆర్థిక ఇబ్బందులను దాటుకొస్తున్నారు. వీరి శ్రమైక జీవనాన్ని చూసి, ఓర్వలేక విధి ఆగ్రహించింది. మృత్యు‘తీగ’ పాశాన్ని విద్యుత్‌ రూపంలో దుర్యోధనపై విసిరింది.

దీంతో ఆయన అక్కడికక్కడే మరణించాడు. కష్టాల కడలి నుంచి నెట్టుకొస్తున్న ఆ కుటుంబం అనాథగా మారింది. కుమా ర్తె నీహారిక, కుమారుడు భార్గవ్‌తో పాటు భార్య సుధారాణి దిక్కులేనివారయ్యారు. దుర్యోధన అంత్యక్రియలు నిర్వహించేందుకు ఎవరూ లేకపోవడంతో పుట్టెడు దుఃఖాన్ని దిగమింగి.. భర్త మృతదేహానికి తలకొరివి పెట్టడానికి సుధారాణి ముందువచ్చింది. బాధను పెదవిన బిగపట్టి, అంత్యక్రియలు నిర్వహించింది. పిల్లల ఆక్రందనను ఆపలేక.. అంత్యక్రియలు నిర్వహించే దిక్కులేక.. చివరికి అన్ని తానై.. భర్తకు అంత్యక్రియలు నిర్వహించిన సుధారాణి దీనస్థితి చూసిన ప్రతి ఒక్కరి హృదయాలు ద్రవించాయి.

మరిన్ని వార్తలు