భార్యను చంపిన భర్త

29 Jul, 2018 06:45 IST|Sakshi

గొల్లప్రోలు (పిఠాపురం): అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో భార్యను భర్త కడతేర్చిన ఘటన చెందుర్తి గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం ఈ గ్రామానికి చెందిన టైలర్‌ గౌస్‌ తన భార్య షేక్‌ రాజాబీబీ (30ను శుక్రవారం రాత్రి హత్య చేశాడు. ప్రత్తిపాడు మండలం వాకపల్లి గ్రామానికి చెందిన ఆమెతో అతనికి 18 ఏళ్ల క్రితం వివాహమైంది. గత మూడేళ్లుగా వీరిద్దరూ తరచూ గొడవ పడుతున్నారు. ప్రత్తిపాడు పోలీస్‌ స్టేషన్‌లో కేసులు కూడా పెట్టుకున్నారు.

 ఆరు నెలలుగా ఇద్దరి మధ్య వివాదం మరింత పెరిగింది. శుక్రవారం రాత్రి మాటామాటా పెరగడంతో భార్య పీకను తాడుతో బిగించి హత్య చేసి అతడు పరారయ్యాడు. వీరికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు షీలార్‌ను ఇటీవల కాకినాడలోని ప్రభుత్వ హాస్టల్‌లో 6వ తరగతిలో చేర్పించారు. చిన్న కుమారుడు నాగూర్‌ స్థానిక మండల పరిషత్‌ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాడు.

 సంఘటనా స్థలాన్ని పిఠాపురం సీఐ అప్పారావు, ఎస్సై బి.శివకృష్ణ పరిశీలించారు. స్థానికులు, కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించారు. కూతురిని కావాలనే అల్లుడు అన్యాయంగా చంపేశాడని మృతురాలి తల్లి షీలార్‌ ఆరోపించింది. మొదటి నుంచి ఆమెను వేధిస్తున్నాడని, తమ కుటుంబానికి న్యాయం చేయాలని విలపించింది. తల్లి షీలార్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని సీఐ అప్పారావు తెలిపారు. నిందితుడిని అరెస్ట్‌ చేస్తామన్నారు.  

మరిన్ని వార్తలు