తిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయంలో అష్టదిగ్బంధన బాలాలయ మహా సంప్రోక్షణను ప్రత్యక్ష ప్రసారం చేయడంపై ఆగమ సలహా మండలి సూచనలు తీసుకుంటున్నామని టీటీడీ ఈవో అనిల్కుమార్ సింఘాల్ తెలిపారు. మహా సంప్రోక్షణను లైవ్లో ప్రసారం చేయడం కుదరన్న టీటీడీ నిర్ణయంపై ఓ వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దాంతో మహా సంప్రోక్షణపై విచారణ చేపట్టని హైకోర్టు.. ప్రత్యక్ష ప్రసారం చేయడానికి అభ్యంతరాలు ఏంటని ప్రశ్నించింది. అదే సమయంలో నివేదిక సమర్పించాలని కోరింది. దాంతో దిగివచ్చిన టీటీడీ.. ఆగమ సలహా మండలి సూచనలు తీసుకుంటుంది. ఈ మేరకు ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడుతూ.. ఆగమ సలహా మండలి సూచనలు తీసుకున్న తర్వాతే మహా సంప్రోక్షణ ప్రత్యక ప్రసారంపై ఒక నిర్ణయానికి వస్తామన్నారు. ఆపై హైకోర్టుకు నివేదిక అందజేస్తామని తెలిపారు.
మరొకవైపు టీటీడీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు సమ్మె తప్పదని హెచ్చరించిన నేపథ్యంలో వారితో ఈవో అనిల్కుమార్ చర్చలు జరుపుతున్నారు. ఉద్యోగులు సమస్యలను తన దృష్టికి తెచ్చిన విషయాన్ని స్పష్టం చేసిన ఈవో.. సమస్యలపై చర్చలు జరుపుతున్నామన్నారు.