ఎమ్మెల్యేలు కాకాణి, పాశం, రామిరెడ్డి, కిలివేటి
పొదలకూరు/గూడూరు/కావలి: రాజకీయాల్లో ఉన్నంతవరకు వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంటే ఉంటామని, పార్టీని వీడే ప్రసక్తే లేదని శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్రెడ్డి, గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్కుమార్, కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి, సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య స్పష్టంచేశారు. శనివారం పొదలకూరు మండల కార్యాలయ సమావేశ మందిరంలో ఎమ్మెల్యే కాకాణి విలేకరులతో మాట్లాడుతూ ఎంపీటీసీ ఎన్నికల సమయం నుంచి కొందరు పనిగట్టుకుని తాను టీడీపీలో చేరతానని దుష్ర్పచారం సాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారని వార్తలు రాసే ముందు సంబంధిత ఎమ్మెల్యేల వివరణ సేకరించాల్సిన బాధ్యత పత్రికలు, టీవీ ఛానళ్లపై ఉందన్నారు. ఆలాగే ఎమ్మెల్యే పాశం సునీల్కుమార్ గూడూరులో విలేకరులతో మాట్లాడుతూ వైఎస్సార్సీపీని వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కల్లబొల్లి మాటలతో అధికారంలోకి వచ్చి, ఇచ్చిన హామీలు నెరవేర్చలేక ప్రజల్లో విలువలు కోల్పోతున్న పార్టీలో తాను చేరుతున్నట్లు ఎల్లో మీడియా పత్రిక అసత్య కథనాన్ని ప్రచురించిందని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా తాను వైఎస్సార్సీపీని వీడేది లేదన్నారు. వైఎస్సార్సీపీ నుంచి మారే ప్రసక్తే లేదని, రాజకీయాల్లో ఉన్నంత కాలం పార్టీ అధినేత జగనన్న వెంటే ఉంటానని ఎమ్మెల్యే సంజీవయ్య తెలిపారు.