టీడీపీ పాలనలో ఎవరికీ భద్రత లేదు
మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి
మంగళగిరి : పశ్చిమగోదావరి జిల్లా మహిళా తహశీల్దార్పై అధికారపార్టీ ఎమ్మెల్యే దాడి గర్హనీయమని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి(ఆర్కే) మండిపడ్డారు.ఈమేరకు పట్టణంలోని ఆయన కార్యాలయం బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. తెలుగుదేశం పార్టీ పాలనలో సామాన్య ప్రజలతో పాటు అధికారులు, ప్రతిపక్ష ప్రజాప్రతినిధులకు భధ్రత లేదన్నారు. దోచుకోవడానికి అడ్డుపడే వారందరిపై దాడులు చేసి భయబ్రాంతులుకు గురి చేస్తే వారి దోపిడి అడ్డురారనే విధంగా అధికారపార్టీ ప్రజాప్రతినిధులు వ్యవహరించడం సిగ్గుచేటన్నారు.
ప్రజాసమస్యలను పరిష్కరించే అధికారులపైనే దాడులకు తెగబడితే వారు ఏవిధంగా ప్రజల సమస్యలను పరిష్కరిస్తారని ప్రశ్నించారు. అధికారపార్టీ నేతల ఒత్తిడితో ప్రజాసమస్యలను పరిష్కరించలేక సెలవులపై వెళ్తున్నారని, దాంతో అనేక ప్రజాసమస్యలు పరిష్కారానికి నోచుకోవట్లేదన్నారు.ఇప్పటికైనా అధికారపార్టీ నేతలు దాడులు బెదిరింపులకు దిగి దోచుకోవడాన్ని ఆపి, ప్రజాసమస్యలపై దృష్టి సారించి పరిష్కరించాలని హితవు పలికారు.