-

భర్త సినిమాకు తీసుకెళ్లలేదని..

20 Aug, 2017 12:51 IST|Sakshi
భర్త సినిమాకు తీసుకెళ్లలేదని..
విజయవాడ: సినిమాకు తీసుకెళ్లే విషయంలో భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగడంతో మనస్తాపానికి గురైన భార్య కాలువలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే అప్రమత్తమైన భర్త ఈత రాకపోయినా ఆమెను రక్షించడానికి కాలువలో దూకాడు. అదే సమయంలో అటు నుంచి వెళ్తున్న ఓ ఏపీఎస్పీ కానిస్టేబుల్‌ కాలువలో కొట్టుకుపోతున్న భార్యాభర్తలను రక్షించి ఒడ్డుకు చేర్చాడు. ఈ సంఘటన విజయవాడలోని లెనిన్‌ సెంటర్‌లో ఆదివారం చోటుచేసుకుంది. 
 
వివరాలు.. నగరంలోని వాంబే కాలనీకి చెందిన కోలుకూరు రాజారెడ్డి(21)కి నాలుగు నెలల క్రితం తిరుపతమ్మ(19)తో వివాహమైంది. కాగా ఈ రోజు భార్యాభర్తల మధ్య సినిమాకు వెళ్లే అంశంలో గొడవ జరిగింది. భర్త సినిమాకు రాను అని చెప్పడంతో.. మనస్తాపానికి గురైన తిరుపతమ్మ లెనిన్‌ సెంటర్‌ సమీపంలోని ఏలూరు కాలువలో దూకి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. దీంతో ఏం చేయాలో అర్థం కాని భర్త రాజారెడ్డి ఈత రాకపోయినా ఆమెను రక్షించేందుకు కాలువలో దూకాడు. ఆమెను రక్షించే క్రమంలో ఇద్దరు కాలువలో కొట్టుకుపోతుండగటం గుర్తించిన ఏపీఎస్పీ కానిస్టేబుల్‌ వెంటనే కాలువలోకి దూకి దంపతులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వారికి కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నారు.
మరిన్ని వార్తలు