ప్రియుడి ఇంటి ఎదుట యువతి మౌనపోరాటం

9 Jan, 2014 04:35 IST|Sakshi
ప్రియుడి ఇంటి ఎదుట యువతి మౌనపోరాటం

ఇల్లెందుఅర్బన్,న్యూస్‌లైన్:  ప్రియుడి ఇంటి ఎదుట ఓ యువతి మౌనపోరాటానికి దిగింది. ఈ ఘటన బుధవారం రాత్రి మండల పరిధిలోని 21 పిట్ ఏరియాలో చోటుచేసుకుంది. బాధితురాలి కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నాయకులగూడేనికి చెందిన కిన్నెర వసంత, 21 పిట్ ఏరియాకు చెందిన ఆటో డ్రైవర్ సింగారపు నవీన్ నాలుగేళ్లుగా ప్రేమించుకున్నారు. 21 పిట్‌ఏరియాలో వసంత టైలరింగ్ నేర్చుకుంటున్న క్రమంలో వారిరువురి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి వసంతను లోబర్చుకున్నాడు. పెళ్లి చేసుకోవాలని వసంత కోరడంతో వాయిదాలు వేస్తూ తప్పిం చుకు తిరుగుతున్నాడు. ఆరు నెలల క్రితం మకాం వరంగల్‌కు మార్చాడు. అప్పటి నుంచి ఇంటికి తాళం వేసి ఉంటోంది. విషయం తెలుసుకున్న వసంత రోజూ ఫోన్ చేస్తున్నా పట్టించుకోవడం లేదు. అనుమానం వచ్చిన బాధితురాలు పెద్ద మనుషులను ఆశ్రయించినా ఫలితంలేకుండాపోయింది.
 
 దీంతో విసిగి వేసారిన బాధితురాలు బుధవారం న్యాయం చేయాలని పోలీసు అధికారులను కోరుతూ ప్రియుడి ఇంటి ఎదుట మౌనపోరాటానికి దిగింది. ఆమె ఆందోళనకు తుడుందెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈసంనర్సింహరావు మద్దతు పలికారు. వసంత  న్యాయం జరిగేంత వరకు తాము కూడా ఆందోళన నిర్వహిస్తామని చెప్పారు. పోలీసులు తక్షణమే స్పందించి బాధితురాలికి న్యాయం చేయాలని కోరారు.

మరిన్ని వార్తలు