సీఎం జగన్‌కు రాఖీ కట్టిన మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు

12 Dec, 2019 12:35 IST|Sakshi

సాక్షి, అమరావతి: మహిళల భద్రత కోసం ఏపీ దిశ యాక్ట్‌ పేరిట చరిత్రాత్మక చట్టాన్ని తీసుకొచ్చిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు ధన్యవాదాలు తెలిపారు. గురువారం సచివాలయంలోని సీఎం చాంబర్‌లో వైఎస్‌ జగన్‌ను డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి, హోంమంత్రి సుచరిత, మంత్రి తానేటి వనిత, ఏపీఐఐసీ చైర్మన్ రోజాతోపాటు మహిళా ఎమ్మెల్యేలు కలిశారు. ఈ సందర్భంగా వారు సీఎం జగన్‌కు రాఖీ కట్టి.. ధన్యవాదాలు తెలిపారు.
మహిళలు, బాలికలపై అత్యాచారాలు వంటి అఘాయిత్యాలకు పాల్పడితే ఉరిశిక్ష విధించేలా.. నిర్ధారించే ఆధారాలున్నప్పుడు 21 రోజుల్లోనే తీర్పు ఇచ్చేలా చారిత్రాత్మక ముసాయిదా బిల్లుకు ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ బుధవారం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. మహిళలు, బాలికలపై క్రూరమైన నేరాలకు పాల్పడే వారికి ఇక జీవితం ఉండదనే రీతిలో స్పష్టమైన సంకేతాలు ఇచ్చేలా ఆంధ్రప్రదేశ్‌ క్రిమినల్‌ లా (సవరణ) చట్టం–2019 (ఆంధ్రప్రదేశ్‌ దిశ యాక్ట్‌)ను తీసుకురావాలని ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. ఈ చట్టంలో భాగంగా మహిళలు, చిన్నారులపై నేరాల విచారణకు ప్రతి జిల్లాకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేస్తారు. మహిళలు, బాలికలపై అత్యాచారాలకు పాల్పడాలంటే హడలెత్తేలా కొత్త చట్టం తీసుకొస్తామని అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఇచ్చిన హామీకి అనుగుణంగా ‘ఏపీ దిశ’ చట్టాన్ని రూపొందించారు.


సీఎం సమక్షంలో కేక్‌ కట్‌ చేసిన బాలినేని
మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి పుట్టినరోజు వేడుకలు సచివాలయంలోని సీఎం చాంబర్‌లో జరిగాయి. సీఎం వైఎస్‌ జగన్‌, మంత్రులు, ఎమ్మెల్యేల సమక్షంలో మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి కేక్‌ కట్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయనకు నేతలందరూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

మరిన్ని వార్తలు