యువతులు మోసపోవద్దు 

7 Dec, 2019 08:44 IST|Sakshi

సాక్షి, బిక్కవోలు(తూర్పు గోదావరి): సాంకేతికంగా ఎన్నో రకాలుగా అభివృద్ధి చెందుతున్నా దేశంలో ఆడపిల్లలు, యువతులు, మహిళలకు రక్షణ లేకుండాపోయింది. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు స్త్రీ బయటకు రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితి. హత్యలే వీటికి కారణం, చట్టాలు పటిష్టంగా ఉన్నా నిందితులకు శిక్షలు సత్వరం పడేలా చేసినప్పుడే అందరికీ భయం ఉంటుందని మహిళాలోకం అభిప్రాయపడుతోంది. చట్టాల గురించి మహిళలంతా తెలుసుకుని ఇటువంటి ఘటనలు జరిగిన సమయంలో ధైర్యంగా ఫిర్యాదు చేయాలంటున్నారు. మహిళలకు చట్టాలపై అవగాహన ఉండాలి. ముఖ్యంగా ఆపదలో ఉన్న సమయాల్లో ఉపయోగపడే హెల్ప్‌లైన్‌ నంబర్లు, 100, 1098, 112 ఏ విధంగా ఉపయోగపడతాయి.. వాటిని ఎలా ఉపయోగించుకోవాలనే అనే విషయం యువతకు అర్థమయ్యేలా వివరించాల్సిన అవసరం ఉంది. 

చట్టం ప్రకారం సహాయం అందిస్తాం 
అమ్మాయిలు కూడా ఆత్మ విశ్వాసంతో పాటు, ఆత్మరక్షణ పద్ధతులను కచ్చితంగా నేర్చుకోవాలి. చట్టం పరమైన సహాయం అందించడానికి ముందుగా ఉంటాము. సెల్‌ఫోన్‌ అవసరమైనపుడు తప్ప ఎక్కువగా ఉపయోగించరాదు.  
– ఎం.వెంకటేశ్వరరావు, తహసీల్దార్, బిక్కవోలు 

మంచి చెడులు చెప్పాలి 
తల్లిదండ్రులు వారి పిల్లలకు చిన్నతనం నుంచే మంచీ చెడుల గురించి చెప్తుండాలి. పాఠశాలలు, కళాశాలలకు వెళ్లి తిరిగి వచ్చే సమయాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటుండాలి. సమాజంలో జరిగే పరిస్థితులను ఎప్పుటికప్పుడు వివరిస్తుండాలి. పిల్లలు బయటకు వెళ్లిన సమయంతో ఎప్పటికçప్పుడు సమాచారం ఇచ్చేలా పిల్లలకు అవగాహన కలి్పంచాలి. ఏదైనా ఆపద సమయంలో పోలీసు వారి హెల్ప్‌లైన్‌ నంబర్లకు ఫోన్‌ చేస్తే వెంటనే సృందించడం జరుగుతుంది. – పి.వాసు, ఎస్సై, బిక్కవోలు

యువతులు మోసపోవద్దు 
నైతికత లేని కుటుంబాల నుంచి వచ్చినవారు.. పర్సనాలిటీ సమస్యలు కలిగిన పిల్లలు.. పెద్దల్లో లైంగిక వాంఛలు ఎక్కువగా ఉండటం వల్ల వారి కోరికలు తీర్చుకోవడానికి దేనికైనా తెగిస్తారు. మగవారి రూపాన్ని చూసి, మాటలు పొగడ్తలను చూసి యువతులు మోసపోవద్దు. ఎవరి జాగ్రత్తలు, హద్దుల్లో వారుండాలి. జీవిత లక్ష్యాలు, కుటుంబ విలువలను గుర్తుంచుకోవాలి. – శివాజీ, పీహెచ్‌సీ వైద్యుడు, కొంకుదురు 

మహిళలంతా అప్రమత్తంగా ఉండాలి
ఆధునిక యుగంలో మహిళలు అన్ని రంగాల్లోను ముందుంటున్నారు. వృత్తి ధర్మంలో భాగంగా బయటకు వెళ్లే మహిళలపై జరిగే దాడులపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి. ఆత్మరక్షణ చిట్కాలపై అవగాహన కలిగి ఉండాలి. చట్టాలు, శిక్షలపై మెళకువ కలిగి ఉండాలి. – కేటికే పద్మశ్రీ, సచివాలయ కార్యదర్శి, పందలపాక 

తల్లిదండ్రులు గమనించాలి 
యువతీ యువకుల ఇంటర్‌నెట్, సోషల్‌ మీడియా వంటి వాటి వినియోగాన్ని తగ్గించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తల్లిదండ్రులు వారి పిల్లలపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. పిల్లలు వినియోగించే ఫోన్లను వారు ఏ విధంగా వినియోగిస్తున్నారో గమనిస్తుండాలి. దీంతో పాటు పిల్లల ముందు తల్లిదండ్రులు చాలా హుందాగా వ్యవహరించాలి. – మట్టపర్తి అనుపమ, ఎంపీడీవో, బిక్కవోలు 

మరిన్ని వార్తలు