మంత్రి శైలజానాథ్‌ను అడ్డగించిన మహిళలు

27 Oct, 2013 06:43 IST|Sakshi

ఒంగోలు టౌన్,న్యూస్‌లైన్: ‘నాలుగు రోజులుగా నీళ్లలోనే ఉన్నాం. ఇళ్లన్నీ బురదమయమయ్యాయి. ఉన్నదంతా వరదలో కొట్టుకుపోయింది. మీరే మమ్మల్ని పట్టించుకోకపోతే ఎలా?’ అంటూ ఒంగోలు నగరంలోని ముంపు ప్రాంత కాలనీ వాసులు జిల్లా ఇన్‌చార్జి మంత్రి సాకే శైలజానాథ్‌ను నిలదీశారు. శనివారం బలరాం కాలనీ, బిలాల్‌నగర్ కాలనీల్లో పర్యటించిన మంత్రికి మహిళలను నుంచి నిరసన ఎదురైంది. తమ కాలనీల్లోని వీధుల దుస్థితి చూడాలంటూ పట్టుబట్టారు. రోడ్లు, మురుగు కాలువలు నిర్మించాలని డిమాండ్ చేశారు. అనంతరం మంత్రి పద్మావతి ఫంక్షన్ హాలులో వరద బాధితులకు ఒక్కొక్కరికి రూ.10 కేజీల బియ్యం, రెండు లీటర్ల కిరోసిన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒంగోలు నగరంలో 10,200 మందికి బియ్యం అందించనున్నట్లు వివరించారు.
 
 జిల్లాలో అధికంగా వర్షాలు కురవడంతో నష్టం పెద్ద ఎత్తున జరిగిందన్నారు. వ్యవసాయ రంగానికి దాదాపు రూ.127 కోట్ల నష్టం సంభవించినట్లు ప్రాథమిక అంచనా అందిందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా నాలుగు నుంచి ఐదు వందల కోట్ల రూపాయల నష్టం జరిగి నట్లు తెలుస్తోందన్నారు. నగరంలోని పోతురాజుకాలువను అభివృద్ధి చేసేందు కు కొన్ని సమస్యలున్నా.. త్వరలోనే పరిష్కరించి ఆధునికీకరిస్తామన్నారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ పోతురాజు కాల్వ ఆక్రమణలకు గురవడంతో సమస్యకు త్వరితగతిన పరి ష్కారం లభించడంలేదన్నారు. కార్యక్రమంలో కలెక్టర్  విజయ్‌కుమార్, ఆర్డీఓ మురళి, కమిషనర్ విజయలక్ష్మి, కాంగ్రెస్ పార్టీనాయకులు జడా బాలనాగేంద్రయాదవ్, ఘనశ్యాం, ఈదర మోహన్, వేమా శ్రీనివాసరావు, కండె శ్రీనివాసులు, నాళం నర్సమ్మ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు