చిత్తూరు కలెక్టర్‌కు చేదు అనుభవం!

8 Jul, 2017 12:43 IST|Sakshi

తిరుప‌తి: చిత్తూరు జిల్లా కలెక్టర్‌కు తిరుపతిలో చేదు అనుభవం ఎదురైంది. మద్యం దుకాణాలు తొలగించాలంటూ ఆందోళన చేస్తున్న మహిళలు శనివారం ఉదయం కలెక్టర్ ప్రద్యుమ్నను అడ్డుకున్నారు. తిరుపతి నగర శివార్లలోని మంగళం ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన యోగా శిక్షణ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వెళుతున్న కలెక్టర్‌ ప్రద్యుమ్న వద్దకు మహిళలు భారీ సంఖ్యలో చేరుకొన్నారు. నివాసాల మధ్య ఉన్న మద్యం దుకాణాలను తొలగించాలని వినతిపత్రాలు సమర్పించారు.

విచారణ నిర్వహించి చర్యలు తీసుకుంటామ‌ని ఆయ‌న తెలిపారు. కలెక్టర్‌ ప్రద్యుమ్న ప్రకటనపై సంతృప్తి చెందని మహిళలు ముందుకు వెళ్లకుండా ఆయన వాహనాన్ని అడ్డుకున్నారు. ఎక్సైజ్‌ అధికారులతో చర్చించి తీవ్ర ఇబ్బందికరమైన ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని మరోసారి హామీ ఇవ్వడంతో మహిళలు ఆందోళ‌న విర‌మించారు.

మరిన్ని వార్తలు