నీళ్ల కోసం రోడ్డెక్కిన మహిళలు

7 Jun, 2018 11:30 IST|Sakshi
రోడ్డుపై బైఠాయించిన మహిళలు

ప్రకాశం, పొదిలి:  నీళ్లు లేక పడుతున్న ఇబ్బందులతో మహిళలు సమస్య తీవ్రతను తెలిపేందుకు రోడ్డు ఎక్కారు. బుధవారం  స్థానిక టైలర్స్‌ కాలనీ వాసులు ఒంగోలు రోడ్డులోని దర్గా సమీపంలో రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఖాళీ బిందెలను ప్రదర్శించారు. నీళ్ల సమస్య గురించి పలు మార్లు విన్నవించినా పట్టించుకునే వారు లేరని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు రోడ్డును వీడ బోమని కూర్చున్నారు.  సాగర్‌ నీరు సక్రమంగా  రావడం లేదని తెలిపారు.

ట్యాంకర్ల ద్వారా వస్తున్న నీరు ఏమాత్రం అవసరాలు తీర్చడం లేదని తెలిపారు. పేదలమైన తాము నీరు కొనుగోలు చేసే పరిస్థితి లేదని వాపోయారు.  మహిళలు రోడ్డుపై బైఠాయించడంతో ట్రాఫిక్‌కు కొంత మేర  అంతరాయం ఏర్పడింది. ఆర్‌డబ్ల్యూఎస్‌ డీఈ శ్రీనివాసరావు, ఎస్సై నాగరాజు సంఘటన స్థలానికి చేరుకుని మహిళలతో మాట్లాడారు. నీటి సమస్య వెంటనే పరిష్కారం చేస్తామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. 

మరిన్ని వార్తలు