విద్యుదాఘాతంతో కార్మికుడి మృతి

11 Feb, 2014 23:54 IST|Sakshi

పటాన్‌చెరు టౌన్, న్యూస్‌లైన్ : విద్యుదాఘాతంతో మండల పరిధిలోని అల్ కబీర్ ఎక్స్‌పోర్ట్స్ లిమిటెడ్‌లో పనిచేస్తున్న ఓ కార్మికుడు దుర్మరణం చెందాడు. అయితే యాజమాన్యం నిర్లక్ష్యంతోనే కార్మికుడు మృతిచెందాడంటూ పరిశ్రమకు చెందిన ఫర్నీచర్, అద్దాలను ధ్వంసం చేశారు. దీంతో పరిశ్రమ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సీఐ శంకర్‌రెడ్డి కథనం మేరకు.. సంగారెడ్డి మండలం ఎద్దుమైలారం (ఓడీఎఫ్) ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ కాలనీలో నివాసం ఉండే యూనస్ (25)  15 రోజుల క్రితమే పరిశ్రమలో వెల్డర్‌గా ఉద్యోగంలో చేరాడు.

 అయితే మంగళవారం ఉదయం జనరల్ షిఫ్ట్‌కు వచ్చి విధులు నిర్వహిస్తున్నాడు. విధుల్లో భాగంగా అబిటాస్ సెక్షన్‌లో వెల్డింగ్ పనులు చేస్తున్న క్రమంలో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే యాజమాన్యం మాత్రం యూన స్ మృతి చెందలేదని కొన ఊపిరితో ఉన్నాడని రామచంద్రాపురం ఈఎస్‌ఐ ఆస్పత్రికి  తరలించారు. అయితే అక్కడి డాక్టర్లు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. దీంతో మృతుడిని తిరిగి పరిశ్రమ వద్దకు తె చ్చారు. విషయం తెలుసుకున్న బంధువులు, కుటుంబ సభ్యులు పరిశ్రమ వద్దకు చేరుకుని యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే యూనస్ మృతి చెందాడని ఆందోళనకు దిగారు.

అంతటితో ఆగక పరిశ్రమకు చెందిన కార్యాలయం కిటికీ అద్దాలు పగుల గొట్టారు. ఫర్నీచర్ , కంప్యూటర్లు ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న సీఐ శంకర్‌రెడ్డి నేతృత్వంలో పోలీసులు హుఠాహుటిన పరిశ్రమ వద్దకు చేరుకుని పరిస్థితిని అ దుపు చేశారు. ఇదిలా ఉండగా మృతుడి కుటుంబానికి ఆర్థిక సాయం ఇవ్వాలంటూ కుటుంబ సభ్యులు, స్థానిక నాయకులు పరిశ్రమ యాజమాన్యంతో సంప్రదింపులు జరిపారు. అయితే రూ. 7 లక్షల నష్టపరిహారం ఇచ్చేందుకు యాజమాన్యం అంగీకరించింది. దీంతో ఆందోళనకారులు వెనుతిరిగారు.

>
మరిన్ని వార్తలు