కదిలిన యంత్రాలు

23 Apr, 2020 13:20 IST|Sakshi
బొబ్బిలిలోని బెర్రీ అల్లాయిస్‌ లిమిటెడ్‌ కంపెనీలో భౌతికదూరం పాటిస్తూ విధులకు హాజరవుతున్న ఉద్యోగులు, (ఇన్‌సెట్లో) పూసపాటిరేగలోని సీపీఎఫ్‌ కంపెనీలో భౌతిక దూరం పాటిస్తూ పనిచేస్తున్న కార్మికులు

తెరచుకున్న పరిశ్రమలతో కార్మికుల్లో ఆనందం

భౌతిక దూరం పాటిస్తూ విధులకు హాజరు

జిల్లాలో తొలిరోజు హాజరైన కార్మికులు 750మంది

కొత్త ఉత్సాహం వచ్చిందన్న కార్మికులు

బొబ్బిలి: కార్మికుల ఆకలి కేకలు తగ్గే తరుణం వచ్చేసింది. ఆంక్షల సడలింపుతో జిల్లాలోని పరిశ్రమలు తెరచుకుంటున్నాయి. మళ్లీ సైరన్‌ మోతలు వినిపి స్తున్నాయి. యంత్రాల హోరు ఆ ప్రాంతాల్లో ప్రతిధ్వనిస్తోంది. కరోనా వైరస్‌ప్రభావంతో ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించడంతో అన్ని పరిశ్రమలు మూత పడిన విషయం తెలిసిందే. ఇటీవలే ప్రభుత్వం కొన్నింటికి సడలింపులు ఇవ్వడంతో కొంత ఊరట లభించింది. ముఖ్యంగా వ్యవసాయ అనుబంధ, ఆహారం, మందులు తదితర పరిశ్రమలు తెరవటానికి అవకాశం కలగడంతో అందులో పనిచేసే కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ లాక్‌డౌన్‌వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న కార్మికులు ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటున్నారు.

మంగళవారం నుంచి పునఃప్రారంభం
జిల్లాలో పరిశ్రమలు మంగళవారం నుంచి పునఃప్రారంభమ ఆ్యయి. 750 మంది కార్మికులు, ఉద్యోగులు విధులకు వస్తున్నారు. హాజరవుతున్న కార్మికులకు థర్మల్‌ స్క్రీనింగ్‌ చేస్తున్నారు. పని ప్రదేశంలో సోషల్‌ డిస్టెన్స్‌ పాటిస్తున్నారు. బొబ్బిలిలో 21 యూనిట్లు ప్రారంభించారు. ఇందులో 450 మంది, వీటీ అగ్రహారంలోని 11 పరిశ్రమల్లో వంద మంది సిబ్బంది వస్తున్నారు. కంటకాపల్లిలోని మూడు యూనిట్లు ప్రారంభించడంతో అక్కడి నుంచి వంద మంది, నెల్లిమర్ల 20 యూనిట్లలో 6 ప్రారంభించారు. ఇక్కడ వంద మంది వరకూ పనులు చేసేందుకు బుధవారం నుంచి వస్తున్నారు. ఇంకా పూసపాటిరేగలోని రెండు కంపెనీలు మొదలయ్యాయి. 

అనుమతులు ఇలా...
మొదట స్థానిక తహసీల్దార్లు కంపెనీ యజమానుల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి వారికి అనుమతులు ఇవ్వొచ్చని జిల్లా కలెక్టర్‌కు సిఫార్సు చేస్తున్నారు. అనంతరం కలెక్టర్‌ ఆయా పరిశ్రమల్లో శానిటైజర్లు, మాస్కుల వినియోగంతోపాటు సోషల్‌ డిస్టెన్స్‌ పాటించి ఉంటున్నారని చూసి సంతృప్తి చెందితే  అనుమతులు ఇస్తున్నారు. మానిటరింగ్‌ అధికారులుగా ఏపీఐఐసీ జోనల్‌ మేనేజర్, డీఐసీ జీఎం, కార్మిక శాఖ ఏసీ వ్యవహరిస్తున్నారు. అనుమతులు ఇచ్చిన కంపెనీలు నడుస్తున్న సమయాల్లో ముగ్గురు పర్యవేక్షక అధికారులు ఆయా కంపెనీలకు ఇన్‌స్పెక్షన్‌కు వెళ్తున్నారు. జాగ్రత్తలు తీసుకోకుంటే వారిపై చర్యలు తీసుకోవడమే గాకుండా, అనుమతులను రద్దు చేసేందుకు సిఫారసు చేస్తారు. ఇవి గాకుండా జాగ్రత్తలు తీసుకుని పరిశ్రమలను పునఃప్రారంభిస్తామని ఆన్‌లైన్‌లోనూ ఆయా యజమానులు దరఖాస్తు చేసుకుంటున్నారు.

పరిశ్రమలు తెరచుకున్నాయి
బొబ్బిలిలోని గ్రోత్‌ సెంటర్‌లో పరిశ్రమలు తెరచుకున్నాయి. బెర్రీ వంటి పలు పరిశ్రమలు తెరచుకోవడంతో కార్మికులు, ఉద్యోగులు తిరిగి కంపెనీల్లో అడుగు పెడుతున్నారు. బొబ్బిలిలో 21 పరిశ్రమలు ప్రారంభించాం. దీంతో పాటు జిల్లాలోని నెల్లిమర్లలో కూడా పూర్తి స్థాయిలో అన్ని పరిశ్రమల్లోనూ ప్రభుత్వం సూచించిన నిష్పత్తి ప్రకారం యూనిట్లు ప్రారంభమయ్యేలా జోనల్‌ మేనేజర్‌ సుధాకర్‌  చర్యలు తీసుకుంటున్నారు.        – బడగల హరిధరరావు, ఐలా కమిషనర్, గ్రోత్‌ సెంటర్, బొబ్బిలి 

మరిన్ని వార్తలు