అంధుల సంక్షేమానికి కృషి

5 Jan, 2014 05:48 IST|Sakshi


 కలెక్టరేట్, న్యూస్‌లైన్ :
 అంధుల సంక్షేమం కోసం కృషి చేస్తామని జిల్లా కలెక్టర్ అహ్మద్‌బాబు తెలిపారు. చదువుకుంటున్న అంధ విద్యార్థులు ప్రతి ఒక్కరికీ స్కాలర్‌షిప్‌లు అందజేస్తామని పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో లూరుు బ్రెయిలీ 205 జయంతి వేడుకలను నిర్వహించారు. విద్యార్థులతో కేక్ కట్ చేయించారు. ముందుగా కలెక్టర్ అంధ విద్యార్థినులతో లూయి బ్రెయిలీ చిత్రపటానికి పూలమాలలు వేసి, జ్యోతిప్రజ్వలన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, అంధులతో భర్తీ చేయాల్సిన పోస్టులకు ఈ నెలలోనే రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నట్లు తెలిపారు. అనంతరం విద్యార్థులకు లిపి ఏవిధంగా నేర్పుతున్నారు.. ఎంత మంది విద్యార్థులు చదువుకుంటున్నారో అడిగి తెలుసుకున్నారు. అంధులకు 40 శాతం వైకల్యం ఉండి సదరం సర్టిఫికెట్ పొందితే రూ.500 పింఛన్, 20 నుంచి 40 శాతం వైకల్యం ఉన్న విద్యార్థులకు రూ.200 పింఛన్ ఇవ్వనున్నట్లు తెలిపారు. అన్ని శాఖల్లో అంధులకు 3 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని పేర్కొన్నారు.
 
 అనంతరం ఉపాధ్యాయుడిగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన అప్పలనాయుడు, శేఖర్‌ను కలెక్టర్ శాలువాలతో సన్మానించారు. ఎంఏ బీఈడీ చేసిన అనిల్‌కుమార్ అనే అంధ విద్యార్థికి ల్యాప్‌టాప్ అందజేశారు. సబ్ కలెక్టర్ ప్రశాంత్‌జీవన్ పాటిల్, వికలాంగుల సంక్షేమ శాఖ ఏడీ నారాయణరావు, సీపీవో షేక్‌మీరా, సారంగపాణి, సంపత్‌ప్యాస్, అశోక్, విద్యార్థులు అమూల్య, శిరీష, సోని, అంజలి, రవళి, నిటేశ్, ఆదిత్య, శాంతారాం, మహేశ్, సాయిప్రణీత్ పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు