ప్రమాదంలో పర్యావరణం

5 Jun, 2020 13:23 IST|Sakshi

ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం నేడు

కాలుష్య కారక వస్తువుల వినియోగం

పెరిగిన ప్లాస్టిక్‌ వాడకం ∙చెట్ల పెంపకంతోనే మనుగడ

శృంగవరపుకోట రూరల్‌: మానవ తప్పిదాలు, అశ్రద్ధ వల్ల వాతావరణం కలుషితమవుతోంది. పెరిగిన యంత్రాలు, రసాయనిక ఎరువులు, వాహనాలు, ఏసీలు, ఫ్రిజ్‌ల వాడకం, పరిశ్రమల, అవి విడుదల చేస్తున్న కాలుష్య వాయువులు వాతావరణాన్ని దెబ్బ తీస్తున్నాయి. వాతావరణ కాలుష్యంతో భూమిపై వేడి పెరిగిపోయి తీవ్ర అతివృష్టి, అనావృష్టి సంభవిస్తున్నాయి. మానవాళికి ఎంతో మేలు చేస్తున్న మొక్కలను పెంచటం, పాత వృక్షాలు, అడవులను రక్షించటం ద్వారా వాతావరణ సమతుల్యత, జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవాలని ఐక్యరాజ్య సమితి కోరుతోంది. 1974వ సంవత్సరం జూన్‌ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవంగా ప్రకటించి కొన్ని సూచనలు చేసింది.

పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవటం మన కనీస బాధ్యత. మనం వాడే పరికరాల వల్లే కాలుష్యం పెరుగుతోంది.
కాలుష్యాన్ని కలిగించే వస్తువులను తగ్గించాలి. ప్లాస్టిక్‌ వాడకాన్ని తగ్గించాలి. ప్లాస్టిక్‌ భూమిలో కొన్ని వేల సంవత్సరాల వరకు కలిసిపోదు.  ∙పర్యావరణ పరిరక్షణకు చెట్లను విరివిగా పెంచాలి.

కాలుష్య నివారణోపాయాలు
ఇంటి దగ్గర చెట్లు నాటండి. ఇంట్లోని చెత్తను కాల్చకుండా కుండీలో పడేయండి.  
ప్లాస్టిక్‌ వాడకాన్ని తగ్గించండి. ఏమైనా కొనాలనుకున్నప్పుడు ఒక సంచి తీసుకెళ్లండి, మంచినీరు కూడా ఇంట్లో నుంచి తీసుకెళ్లండి, ప్లాస్టిక్‌ సీసాల వాడకం తగ్గించండి.
ఇంధన వాడకాన్ని తగ్గించండి. చేరవలసిన గమ్యం దగ్గరైతే నడిచి వెళ్లండి. ఆరోగ్యానికి కూడా మంచిది. కాలుష్యం తగ్గుతుంది. కావలసినవి మాత్రమే కొనండి. ఏ వస్తువైనా పనికి రాదనిపిస్తే పాత వస్తువులను కొనే దుకాణంలో అమ్మండి.

4 లక్షల మొక్కలు నాటాం
ఇప్పటివరకు 4 లక్షలకు పైగా మొక్కలు నాటాం. అందులో 40 శాతం మొక్కలను సంరక్షించగలిగాం. మొక్కలను నాటడం కాకుండా..నాటిన మొక్కలను విధిగా సంరక్షించేలా చర్యలు చేపట్టాలి.
– బొబ్బిలి రామకృష్ణ,వ్యవస్థాపకుడు, గ్రీన్‌ఎర్త్‌ ఆర్గనైజేషన్, శృంగవరపుకోట

మరిన్ని వార్తలు