పరభాష వద్దు.. తెలుగే ముద్దు

30 Aug, 2018 13:27 IST|Sakshi
 విద్యార్థినులతో ఉపాధ్యాయులు

కోడుమూరు రూరల్‌ (కర్నూలు): పరభాషల వ్యామోహంలో పడి అమ్మలాంటి తెలుగు భాషకు విద్యార్థులు దూరమవుతున్నారని తహసీల్దార్‌ వేణుగోపాల్‌ అన్నారు. అంతర్జాతీయ క్రీడా దినోత్సవం, తెలుగు భాష దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం మండలంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో హాకీ క్రీడాకారుడు ధ్యాన్‌చంద్, తెలుగు భాషాకోవిదుడు గిడుగు వెంకటరామమూర్తి చిత్ర పటాలకు ఉపాధ్యాయులు, విద్యార్థులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పట్టణంలోని ఠాగూర్‌ విద్యానికేతన్‌లో నిర్వహించిన తెలుగు భాషా దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తహసీల్దార్‌ మాట్లాడుతూ విద్యార్థులంతా తెలుగుభాష, సంస్కృతి సంప్రదాయలపై విద్యార్థులు అవగాహన ఉండాలని, కేవలం జీవించడానికి మాత్రమే పరభాషలు సరిపోతాయన్నారు. అనంతరం తెలుగు భాష గొప్పతనాన్ని వివరిస్తూ విద్యార్థినీలు సాంస్కృతిక కార్యక్రమాలు, భువన విజయం నాటికను ప్రదర్శించారు. కార్యక్రమంలో ఎంఈఓ అనంతయ్య, ఎస్‌ఐ రామాంజులు, రిటైర్డ్‌ ఎంఈఓ నాగరత్నం శెట్టి, పాఠశాల కరస్పాడెంట్‌ కృష్ణయ్య, హెచ్‌ఎం మధు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 

విశ్వవాణి హైస్కూల్లో.. 
తెలుగు భాష దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక విశ్వవాణి హైస్కూల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులు తెలుగుతల్లి చిత్ర పటానికి పూలమాల వేసి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తెలుగు భాష గొప్పతనాన్ని వివరిస్తూ విద్యార్థులు ఆలపించిన గేయాలు, పద్యాలు ఏకపాత్రాభినయ సంభాషణలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో పాఠశాల కరస్పాడెంట్‌ ఖలీల్‌బాషా, డైరెక్టర్‌ శ్రీనివాసులు, హెచ్‌ఎం గిడ్డయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
 
బాలికల హైస్కూల్లో.. 
అంతర్జాతీయ క్రీడా దినోత్సవం, తెలుగు భాష దినోత్సవం సందర్భంగా బాలికల హైస్కూల్లో హెచ్‌ఎం జ్యోతి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు హాకీ క్రీడాకారుడు ధ్యాన్‌చంద్, గిడుగు వెంకటరామమూర్తి చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అమ్మభాష బతికించాలి 
సి.బెళగల్‌: ప్రతిఒక్కరూ మాతృభాషను బతికించాలని మోడల్‌ ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం, రచయిత రేవుల శ్రీనివాసులు అన్నారు. బుధవారం గిడుగు వెంకటరామూర్తి జయంతిని పురస్కరించుకొని హెచ్‌ఎం ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు కిష్టన్న, హరిబాబు, దుగ్గెమ్మలు  అంతర్జాతీయ తెలుగుభాష దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు తెలుగుతల్లి చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించి, విద్యార్థులతో కవి, కవితా సమ్మేళనం నిర్వహించారు. హెచ్‌ఎం రేవుల శ్రీనివాసులును పాఠశాల సిబ్బంది, విద్యార్థులలు శాలువ కప్పి, జ్ఞాపికలతో సత్కరించారు. అదేవిధంగా జెడ్పీ హైస్కూల్లో హెచ్‌ఎం సత్యనారాయణ అధ్యక్షతన తెలుగు ఉపాధ్యాయురాలు శ్యామల తెలుగ భాష దినోత్సవం సందర్ఢఃగా  తెలుగు గొప్పతనాన్ని వివరిస్తూ కవిత్వాలు వినిపించారు.  

గూడూరు రూరల్‌: జూలకల్‌లోని ఆదర్శ పాఠశాలలో బుధవారం తెలుగు భాష దినోత్సవ కార్యక్రమాన్ని విద్యార్థులు, ఉపాధ్యాయులు ఘనంగా జరుపుకున్నారు. గిడుగు వెంకటరామమూర్తి తెలుగు భాష అభివృద్ధికి చేసిన కృషి, తెలుగు ప్రాధాన్యతపై విద్యార్థులకు ప్రిన్సిపాల్‌ నిర్మలకుమారి వివరించారు. అనంతరం విద్యార్థినులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. విద్యార్థినులు తెలుగుతల్లి వేషధారణతో పాటు తెలుగు సంప్రదాయాలు ప్రతిబిందించేలా వస్త్రాధారణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

మరిన్ని వార్తలు