మీ పిల్లలకైతే పెడతారా?

1 Jul, 2016 03:08 IST|Sakshi
మీ పిల్లలకైతే పెడతారా?

మధ్యాహ్న భోజనానికి ముగ్గిన బియ్యం
బియ్యం నిండా పురుగులే..
శుక్రవారం నుంచి వండాల్సిందేనంటున్న ఓ ఉద్యోగి
నిరాకరిస్తున్న వంట ఏజెన్సీ నిర్వాహకులు
వద్దన్నా వినకుండా బియ్యం పంపారు: హెచ్‌ఎం

బియ్యం నిండా పురుగులు.. భరించలేని దుర్వాసన.. సగానికిపైగా గడ్డకట్టిన బియ్యం.. మూట విప్పితే ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్న మధ్యాహ్న భోజనానికి వినియోగించే బియ్యాన్ని వండి విద్యార్థులకు పెడితే ఏమైనా ఉందా, ఇక అంతే.. ఆసుపత్రిపాలు కాకతప్పదు. రైల్వేకోడూరు మండలం కే.బుడుగుంటపల్లె పాఠశాలలో ఉన్న బియ్యం పరిస్థితి ఇది. ఈ బియ్యం వద్దన్నా అధికారుల చెవికెక్కడం లేదు. పేదపిల్లలంటే ఇంత చులకనా.. వీటిని మీ పిల్లలకైతే పెడతారా.. అంటూ అధికారులపై గ్రామస్తులు మండిపడుతున్నారు.

 కె.బుడుగుంటపల్లె(రైల్వేకోడూరు రూరల్) :  పేద విద్యార్థుల ఆకలి తీర్చాలనే ఉన్నతాశయంతో ప్రవేశపెట్టిన మధ్యాహ్న భోజన పథకంపై పాలకుల పర్యవేక్షణ కొరవడింది. ముగ్గిన బియ్యం, దాని నిండా పురుగులతో పాఠశాలలకు చేరడంతో ఉపాధ్యాయులు, వంట ఏజెన్సీ వారు అవాక్కయ్యా రు. వివరాల్లోకెళితే... రైల్వేకోడూరు మం డలం బుడుగుంటపల్లెలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో వేసవి సెలవులకు ముందు అధికారులు ముగ్గిన బియ్యం దింపి వెళ్లారు. అక్కడున్న వారు వద్దంటున్నా వినకుండా ఓ గదిలో మధ్యాహ్న భోజనానికి వినియోగించే సుమారు వందకుపైగా బియ్యం బస్తాలు దించారు. అప్పటి నుంచి అవి అక్కడే నిల్వ ఉన్నాయి. సెలవుల అనంతరం తలుపులు తెరిచి చూస్తే బియ్యంలో కుప్పలు తెప్పలుగా పురుగులు కనిపించాయి.

బస్తాలను తెరిచి చూసిన వంట ఏజెన్సీవారు వండలేమని చేతులెత్తేశారు. కానీ ఆ పాఠశాలలో పనిచేస్తున్న ఓ కిందిస్థాయి ఉద్యోగి శుక్రవారం నుంచి ఎలాగైనా వాడాలని తెలపడంతో వారు మీడియాను ఆశ్రయించారు. శుక్రవారం నుంచి పురుగుల బియ్యాన్ని శుభ్రం చేసి వండి విద్యార్థులకు వడ్డించాలని ఓ ఉద్యోగి అంటున్నారని తెలిపారు. తాము ఇక్కడే 15 సంవత్సరాలుగా వంట ఏజెన్సీ నిర్వహిస్తున్నామని, అలా చేయలేమని వాపోయారు. ప్రధానోపాధ్యాయురాలు మాత్రం ఆ బియ్యాన్ని వెనక్కి తీసుకెళ్లమని లెటర్ పెట్టినా స్పందన లేదని, ఆ బియ్యం తమకు వద్దని, మార్చాలని చెబుతున్నారు.

 పేద విద్యార్థులంటే అంత చులకనా....
ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులంటే ఇంత చులకనా.. ఎవరికీ పనికిరాని బియ్యం చేర్చారని, వాటిని వండి వడ్డించితే ఇంకేమైనా ఉందా? అని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ మధ్యాహ్న భోజ నాన్ని నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డా రు. గోదాము నుంచి అలాంటి బియ్యాన్ని పాఠశాలలకు ఎలా పంపుతారని వారు ప్రశ్నిస్తున్నారు. అధికారులు చర్యలు తీసుకుని వాటిని వెనక్కు పంపి మంచి బియ్యం సరఫరా చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈ ఒక్క పాఠశాలలోనే ఇన్ని బియ్యం బస్తాలు నిల్వ ఉంటే మరి జిల్లాలో మిగిలిన పాఠశాల్లో ఎలా ఉ న్నాయో అధికారులు పరిశీలించాల్సి ఉంది.

పురుగులున్న బియ్యం వండలేను
పురుగులు ఉండి, వాసన వస్తున్న బియ్యం వండి విద్యార్థులకు పెట్టలేను. అవే వండాలని ఒత్తిడి చేస్తున్నారు. పదేళ్లుగా ఎప్పుడూ ఇలాంటి బియ్యం రాలేదు. దయచేసి బియ్యం మార్చి విద్యార్థులకు మంచి బియ్యం అందించండి.
- జయమ్మ, వంట ఏజెన్సీ నిర్వాహకురాలు

బియ్యం వద్దన్నా వినలేదు
బియ్యం మాకు వ ద్దని లెటర్ పెట్టినా వినలేదు. బియ్యం దింపారు. ఇప్పుడు బియ్యం నిండా పురుగులు ఉన్నాయి. ఇలాంటి బియ్యం వాడలేం. సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని బియ్యం మార్చి వేరే బియ్యం వేసేలా చూడాలి.
- కోమలాదేవి, ప్రధానోపాధ్యాయురాలు, ప్రభుత్వ పాఠశాల, రైల్వేకోడూరు

మరిన్ని వార్తలు