ట్రెండ్ సెట్ చేస్తా

22 Jul, 2014 00:32 IST|Sakshi
ట్రెండ్ సెట్ చేస్తా
  • రెవెన్యూ శాఖ ప్రక్షాళనకు కలెక్టర్ సిద్ధం
  •   ప్రతీ సోమవారం సెట్ కాన్ఫరెన్స్
  •   సిబ్బంది వ్యవహారాలపై సీరియస్   
  •  తహశీల్దార్లకు బాధ్యతల నిర్దేశం
  • విశాఖ రూరల్ : రెవెన్యూ శాఖ ప్రక్షాళనకు కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ సిద్ధమయ్యారు. సిబ్బందిపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో శాఖలో సమూల మార్పులు చేయాలని భావిస్తున్నారు. రెవెన్యూ అధికారులు వారంలో చేయాల్సిన విధులను స్వయంగా పురమాయించనున్నారు. భూక్రమణలు, రికార్డుల ట్యాంపరింగ్‌ల విషయంలో సిబ్బంది పాత్రపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు వీఆర్వో, ఆర్‌ఐ చేతుల్లో ఉన్న అడంగళ్లు, 1బి రిజిస్టర్లను వెంటనే తహశీల్దార్లకు అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు. కోర్టు కేసుల్లో ఉన్న భూవివాదాల వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
     
    అందుబాటులో తహశీల్దార్లు ఉండాలి
     
    తహశీల్దార్లు, ఇతర రెవెన్యూ సిబ్బంది తప్పనిసరిగా మండల కేంద్రాల్లో అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రతి సోమవారం ఉదయం 9.30 నుంచి 10 గంటల వరకు కలెక్టర్ మండల తహశీల్దార్లతో సెట్ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ప్రస్తుతం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించేందుకు మండల కార్యాలయాల్లో సదుపాయాల్లేకపోవడంతో సెట్ కాన్ఫరెన్స్‌లో తహశీల్దార్లకు సూచనలు, ఆదేశాలు జారీ చేయాలని భావిస్తున్నారు. ప్రధానంగా ఆ వారంలో రెవె న్యూ సిబ్బంది చేపట్టాల్సిన బాధ్యతలను కలెక్టరే నిర్ధేశించనున్నారు. వాటిని వారంలోగా పూర్తి చేసి తరువాత సోమవారం జరిగే సెట్ కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌కు వివరించాల్సి ఉంటుంది.

    ఈ సోమవారం కూడా కలెక్టర్ కొందరు తహశీల్దార్లతో సెట్ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. విశాఖ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఆనందపురంలో సెట్ సక్రమంగా పని చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పాడేరు రెవెన్యూ డివిజన్ పరిధిలో కూడా సాంకేతికపరంగా కొన్ని ఇబ్బందులున్నట్లు గుర్తించారు. దీంతో వచ్చే వారంలోగా అన్ని సెట్లు సక్రమంగా పనిచేసేలా చూడాలని ఆదేశించారు.
     
    రికార్డుల బాధ్యత తహశీల్దార్లదే
     
    జిల్లాలోని కొన్ని మండలాల్లో అడంగళ్లు, 1బి రిజిస్టర్లు వీఆర్వో, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ల చేతిలో ఉన్నాయి. రికార్డుల ట్యాంపరింగ్ విపరీతంగా జరిగినట్లు ఇటీవల నిర్వహించిన భూముల సర్వేలో వెల్లడైంది. పాత అడంగళ్లన్నింటినీ సంబంధిత తహశీల్దార్‌కు వెంటనే అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు.

    అవసరమైతే వెబ్‌ల్యాండ్‌లో కొత్తవి ప్రింట్ తీసుకోవాలని సూచన లిచ్చారు. అసైన్ భూముల వ్యవహారంలో అనేక అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తించడంతో 1బి రిజిస్టర్లు కూడా తహశీల్దార్ల వద్దే ఉండాలని సెట్ కాన్ఫరెన్స్‌లో అధికారులకు స్పష్టం చేశారు. రికార్డుల ట్యాంపరింగ్, ఇప్పటికీ అడంగళ్లు, అసెన్మైంట్ రిజిస్టర్లు వీఆర్వో, ఆర్‌ఐల వద్ద ఉంటే అందుకు తహశీల్దార్లే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
     
    కోర్టుల్లో 629 భూ వివాదాలు
     
    జిల్లాలో ప్రభుత్వ భూముల వివాదాలకు సంబంధించి న్యాయస్థానాల్లో 629 కేసులున్నట్లు అధికారులు గుర్తించారు. వాటిలో ప్రధానమైన కేసులను వేగంగా పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోడానికి వీలుగా అన్ని కేసుల వివరాలను కంపూటర్‌లో పొందుపరచాలని కలెక్టర్ నిర్ణయించారు. తద్వారా ఏ కేసు ఏ స్థాయిలో ఉంది, ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న విషయం స్పష్టంగా తెలుస్తుందని ఆయన భావిస్తున్నారు.
     

>
మరిన్ని వార్తలు