గండం...!

3 Mar, 2015 03:16 IST|Sakshi

వేసవి వచ్చిందంటే జిల్లాలో తాగునీటి కోసం ఓ మోస్తరు యుద్ధాలు జరగాల్సిందే. అలాంటిది గత ఏడాది వర్షపాతం మరింత తక్కువ కావడంతో మార్చిలోనే తాగునీటి సమస్య జఠిలంగా మారుతోంది. ముందస్తు ప్రణాళికలకు ఇప్పటికైనా బూజు దులుపకపోతే రానున్న రోజుల్లో జిల్లా ప్రజానీకం గుక్కెడు నీటికి కూడా అల్లాడాల్సిన పరిస్థితి తప్పదు.
 
అనంతపురం అర్బన్  : తీవ్ర కరువుతో సతమతమవుతున్న జిల్లాలో ములిగే నక్కపై.. తాటికాయ పడ్డ చందంగా తీవ్ర తాగునీటి ఎద్దడి నేనున్నానంటూ పలకరిస్తోంది. వేసవి మొదలయ్యేటప్పటికే జిల్లాలోని పలు ప్రాంతాల్లో నీటి సమస్య తీవ్రత కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అనంతపురం నగరంతో పాటు జిల్లాలో 547 గ్రామాలకు శ్రీ భగవాన్ సత్యసాయి బాబా తాగునీటి సౌకర్యాన్ని సత్యసాయి ట్రస్టు ద్వారా కల్పించారు. అయినా జిల్లాలో వేసవిలో తాగునీటి సమస్య సర్వసాధారణంగా మారుతోంది.
 
జిల్లాలో 1003 గ్రామ పంచాయితీల్లో సుమారు 31.18 లక్షల మంది జనాభా ఉన్నారు. వేసవిలో ఒక్కో మనిషికి సగుటున ప్రతిరోజు 2 నుంచి 3 లీటర ్ల తాగునీరు అవసరమవుతుంది.. అలాగే జిల్లాలో ఉన్న 15 ల క్షల పశువులకు రోజుకు ఒక్కో దానికి 10 నుండి 12 లీటర్లు తాగునీరు అవసరమవుతుంది. దీని ప్రకారం గ్రామీణ ప్రాంత అవసరాలకు రోజుకు  సుమారు 2.40 కోట్ల లీటర్ల తాగునీరు అవసరం కాగా ప్రస్తుతం 1.80 కోట్ల లీటర్లు మాత్రమే సరఫరా అవుతోంది. మార్చి నెల మొదటి వారంలోనే పరిస్థితి ఇలా ఉంటే.. మే నెలలో తాగునీటి పరిస్థితి మరింత దారుణంగా ఏర్పడే ప్రమాదం ఉంది. జిల్లాలో సాధారణంగా 502 మి.మీ. వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. ఈసారి కేవలం 274 మి. మీ. మాత్రమే వర్షపాతం నమోదైంది. దీంతో పరిస్థితి మరింత ప్రమాదకరంగా ఉంది.
 
అడుగంటుతున్న భూగర్భజలాలు
జిల్లాలో పూర్తి స్థాయిలో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రత.. నదీ పరివాహక ప్రాంతాల్లో విచ్చలవిడిగా ఇసుక తవ్వకాల వల్ల భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటి పోతున్నాయి. జిల్లాలో 13,386 తాగునీటి బోరు బావులు ఉండగా. వీటిలో వర్షకాలంలో 1304 బోరు బావుల్లో తాగునీరు లభించగా, 4146 పూర్తిగా అడుగంటి  పోయాయి. 216 బోరు బావులు మరమ్మతులకు నోచుకోక దిష్టిబొమ్మలా మారాయి. ప్రస్తుతం జిల్లాలో 302 గ్రామాల్లో తాగునీటి సమస్య తీర్చడానికి దాదాపు 1200 ట్యాంక ర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నట్లు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి.

అయితే ఇప్పటికే సుమారు 576 గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రమైనట్లు సమాచారం. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యను గుర్తించకపోవడంలో అధికారులు విఫలమవుతున్నారనే విమర్శలు ఉన్నాయి.  కొన్ని గ్రామాల్లో  బోరుబావులు మరమ్మతులకు నోచుకోపోవడంతో సుమారు ఒక కిలోమీటరు దూరం నుండి తాగునీరు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. అధికారులు ముందస్తు ప్రణాళికలు లేకపోవడంతో వచ్చే వేసవిలో తాగునీటి సమస్య మరింత జఠిలమయ్యే పరిస్థితి ఏర్పడనుంది.  ఇప్పటికే పుట్లూరు, యల్లనూరు, కళ్యాణదుర్గం, కదిరి, బుక్కపట్నం, ఓడీ చెరువు, ఎన్‌పి కుంట త దితర మండలాల్లో భూగర్భజలాలు అడుగంటి పోయాయి.
 
తెప్పులుగా ట్యాంకర్ల బకాయిలు
 తాగునీటి సమస్యత్మాక గ్రామాల్లో సుమారు 1200 ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు. అయితే ఈ ట్యాంకర్లకు సంబంధించిన బిల్లుల చెల్లింపులో జాప్యం జరుగుతోంది. ఇప్పటికే రూ.4.39 కోట్లు ట్యాంకర్ల యాజమానులకు ప్రభుత్వం బకాయి ఉంది.  బకాయిలు చెల్లించకపోతే తాగునీటి సరఫరాను ఆపివేస్తామని ట్యాంకర్ల యాజమానులు బహిరంగంగా హెచ్చరిస్తున్నారు. ఒక్కసారిగా తాగునీటి సరఫరాను ఆపివేస్తే.. పలు పల్లెల్లో తాగునీటి కోసం విలవిలలాడాల్సిన పరిస్థితి. వచ్చే వేసవిలో తాగునీటి సమస్యనుంచి అధికారులు గట్టెక్కిస్తారో..? లేక మహిళలను ఖాళీ బిందెలతో రోడ్లపై నిలబెడతారో...? వేచి చూడాల్సిందే..!
 
ట్యాంకర్లకు బకాయిలు చెల్లిస్తాం :
ట్యాంకర్ల యజమానులకు బకాయిలు చెల్లిస్తామని ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌సి ఎస్ కాంతనాథం తెలిపారు. నిధుల కోసం ప్రభుత్వానికి నివేదిక పంపగా.. ఇటీవల రూ. 11 కోట్లు మంజూరు చేసిందన్నారు. వీటితో బకాయిలు చెల్లించి.. బోరు బావుల మరమ్మతులు, ముందస్తు చర్యలు చేపట్టి జిల్లాలో తాగునీటి సమస్యను అధిగమిస్తామన్నారు.

మరిన్ని వార్తలు